మియాపూర్( హైదరాబాద్) : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి , విప్ ఆరెకపూడి గాంధీ(Arekapudi Gandhi) కి నియోజకవర్గ టీడీపీ (TDP) నేతలు సంపూర్ణ మద్దతు పలికారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం నియోజకవర్గంలోని 9 డివిజన్లకు చెందిన టీడీపీ అధ్యక్షులు, నాయకులు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్రావు నేతృత్వంలో గాంధీకి మద్దతుగా భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.
నియోజకవర్గంలో గాంధీని అధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు టీడీపీ శ్రేణులంతా అండగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్రావు తెలిపారు. ఈ ర్యాలీలో విప్ గాంధీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆ పార్టీకి తనకు పుట్టినిళ్లు వంటిదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి (BRSCandidate ) అయిన తనకు మద్దతుగా నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నేతలు ముందుకు వచ్చి మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. నియోజకవర్గ ప్రజల మద్దతుతో హ్యట్రిక్ సాధించటం తథ్యమని ధీమాను వ్యక్తం చేశారు.
విజయోత్సవాలకు సిద్ధంగా ఉండండి..
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల ప్రచారానికి మాత్రమే విరామం ఇస్తున్నట్లు , మూడో తారీఖున హ్యట్రిక్ విజయోత్సవాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. పదేండ్ల తన పారదర్శక సేవల పట్ల ప్రజలలో విశేష ఆదరణ ఉన్నదని, సకల జనుల సంపూర్ణ మద్దతుతో విజయంతో మరో అయిదేండ్లు వారికి సేవలో తరించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) తోడ్పాటుతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించానని, మౌలిక వసతులను విస్తృతంగా కల్పించామన్నారు.