కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 4 : థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం మూసాపేట సర్కిల్లోని కేపీహెచ్బీ కాలనీ 4, 7వ ఫేజ్లలో థీమ్ పార్కు పనులను, 4వ ఫేజ్లోని ముస్లిం శ్మశానవాటిక, జేఎన్టీయూహెచ్ హైటెక్సిటీ రోడ్డులోని ఫ్లై ఓవర్ పార్కును జడ్సీ మమత పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్సీ మమత మాట్లాడుతూ.. నగరంలోని ప్రజలు కుటుంబ సమేతంగా సేద తీరేలా థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లో జిమ్ పార్కు, 7వ ఫేజ్లోని ఎల్ఈడీ లైట్ పార్కులు అందుబాటులోకి తెచ్చేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానవాటికలో ప్రహరీలతో పాటు సకల సౌకర్యాలను కల్పించేందుకు చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. శ్మశానవాటికలలో గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. కాలనీలలోని ఖాళీ స్థలాలను గుర్తించి పచ్చని మొక్కలతో పార్కులుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు మధ్యలో సెంట్రల్ మీడియన్లను అభివృద్ధి చేయాలన్నారు. హైటెక్సిటీ రోడ్డులో ఫ్లై ఓవర్ పార్కులో పార్కు లైబ్రరీని అందుబాటులోకి తేవాలన్నారు. కాలనీలు, బస్తీలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఈఈ సత్యనారాయణ, డీఈ శ్రీదేవి, ఏఈ సాయిప్రసాద్ పాల్గొన్నారు.