సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సిటీలో అక్రమ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఒక్కో సిలిండర్ రూ.6వేలకు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసి, 414 సిలిండర్లను సీజ్ చేశారు. గ్యాస్ డీలర్ అమీర్తో సహా 10 మంది నిందితులను పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వివరాలు వెల్లడించారు. అఫ్జల్ గంజ్లో మహ్మద్ అమీర్ అనే వ్యక్తి మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరుతో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కలిగి ఉండగా, ఈ ఏజెన్సీ ద్వారానే బ్లాక్ సిలిండర్ల దందా జరుగుతున్నదని తమకు సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు.
పంజాగుట్ట శ్మశానవాటికలో సిలిండర్లు డంప్ చేసి అక్కడి నుంచి బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారని, హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ధరలకు సిలిండర్లు అమ్ముతున్నట్లు చెప్పారు. ఏజెన్సీ పేరుతో శంషాబాద్లో గోడౌన్, అఫ్జల్ గంజ్లో గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తూ డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లు అమ్ముతున్నారని, ఈ క్రమంలో రూ.2100 గ్యాస్ సిలిండర్ ధర ఉంటే హోటళ్లు, రెస్టారెంట్లకు ఒక కమర్షియల్ సిలిండర్ను రూ.6 వేలకు బ్లాక్లో అమ్ముతున్నారని చెప్పారు. ఈ ముఠా గత కొంతకాలంగా మార్కెట్లో కృత్రిమకొరతను సృష్టించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దేశంలో ఎక్కడా గ్యాస్, ఇంధన కొరత లేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని, ఎవరైనా బ్లాక్ మార్కెట్లో గ్యాస్, పెట్రోల్ అమ్మితే పోలీసులకు తెలపాలని డీసీపీ గైక్వాడ్ ప్రజలకు సూచించారు. సీజ్ చేసిన సిలిండర్లను పౌరసరఫరా శాఖకు అప్పగించారు.