సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో భారీ స్థాయిలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు నిషేధిత గుట్కా ప్యాకెట్లతో వచ్చిన లారీని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని..అందులో ఉన్న దాదాపు రూ. 72 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. ఇటీవల నగరంలో దాదాపు రూ.30 లక్షల నిషేధిత సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు. శనివారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు.
ఉత్తరఖండ్కు చెందిన ప్రతాప్కుమార్ భాస్కర్ కొన్నేండ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి కాటేదాన్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. నవ భారత్ రోడ్డు ట్రాన్స్పోర్టు పేరుతో బేగంబజార్లో ట్రాన్స్పోర్టు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. దానికి అమిత్ అనిల్ యాదవ్ లోడింగ్, అన్లోడింగ్ ఏజెంట్గా, మెహన్ గోడౌన్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. అయితే.. ట్రాన్స్పోర్టు ముసుగులో ఈ ముగ్గురు కలిసి అక్రమ పద్ధతిలో వివిధ రాష్ర్టాల నుంచి నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను నగరానికి రవాణా చేస్తున్నారు.
ఢిల్లీలో నిషేధిత ఉత్పత్తులను లారీ లోపలి భాగంలో లోడ్ చేసి, బయట నిత్యావసర వస్తువులు పెట్టి తీసుకొస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం, షాహినాయథ్గంజ్ పోలీసులతో కలిసి బేగంబజార్లోని గోడౌన్లో గుట్కాను అన్లోడ్ చేస్తున్న లారీ (ఆర్జే14 జీఎఫ్ 8095)ను పట్టుకున్నారు. అందులో రూ. 71,93120 విలువైన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని.. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అలాగే సౌత్, ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రాఘవేంద్ర, శ్రీనివాస్ బృందాలు ఇటీవల 31 కేసుల్లో 32 మందిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ. 30,18000 నిషేధిత గుట్కాలు, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం చాంద్రాయణగుట్ట ప్రాంతం లో రూ.10లక్షల విలువైన నిషేధిత సొత్తును స్వాధీనం చేసుకుని.. అబ్దుల్ అజాం, అబు బాకర్ బిన్ ఇలియాస్ జుంబాలి, ఒమర్ బిన్లను అరెస్ట్ చేయగా.. గుట్కా డిస్ట్రిబ్యూటర్లు జకీర్, ఉస్మాన్ జుంబాలిలు పరారీలో ఉన్నారు. సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్రావు, శ్రీనివాస్, రాఘవేంద్ర తదతరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో గుట్కా, మట్కా, పేకాట క్లబ్బులకు తావులేదని సీపీ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్ఫోర్స్ బృందాలు 24 గంటలు నిఘా పెట్టి.. నిషేధిత వస్తువులు నగరానికి రాకుండా పనిచేస్తున్నాయన్నారు. కరోనా సమయంలో కొందరు వ్యాపారులు బీదర్, నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి గుట్కాను తెచ్చి.. ఇక్కడ అక్రమంగా విక్రయిస్తున్నారని తెలిపారు.
2020లో నిషేధిత గుట్కా విక్రయాలపై 654 కేసులు నమోదు చేసి 689 మందిని అరెస్ట్ చేశామని, అదే విధంగా ఈ ఏడాది 159 కేసుల్లో 173 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గుట్కా, ఇతర అక్రమ దందాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు. గుట్కా విక్రయాలు, రవాణాపై ప్రజలు వెంటనే ఫోన్: 9490616555 కు సమాచారం ఇవ్వాలని.. సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతులను అందిస్తామని సీపీ వెల్లడించారు.