ఉస్మానియా యూనివర్సిటీ, మే 1: రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తున్నదన్నారు. తార్నాక డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. లాలాపేటలోని నఫీజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పద్మారావు గౌడ్, హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి హాజరయ్యారు. సమ్మేళనానికి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన పోరాటానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ.. అభివృద్ధి పథంలో నడుపుతున్నారని కొనియాడారు. ప్రజావసరాలను ముందుగా గుర్తించి, వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కార్యకర్తల శ్రమ, కృషిని విస్మరించబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, బీఆర్ఎస్ యువనేతలు రామేశ్వర్గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజలను విభజించి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలుస్తోందన్నారు. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టానికి మరోసారి కేసీఆర్ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తెలంగాణ వాదానికి కంచుకోటగా నిలిచిందని గుర్తు చేశారు. అభివృద్ధిలో, ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఆదర్శంగా ఉన్నదని ప్రశంసించారు.