సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి డ్రగ్స్ను పూర్తిస్థాయిలో తరిమివేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకోవద్దని, రెండు, మూడు నెలల్లోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారిగా నగర కమిషనరేట్లోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని ఆడిటోరియంలో ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి ఆయా విభాగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బేసిక్ పోలీసింగ్, కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్ను తుది ముట్టించడం వంటి అంశాలపై సీపీ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణపై దృష్టి పెడుతూ ప్రజలకు సేవ చేయాలన్నారు.
తప్పు చేసిన వారిపై కఠినంగా ఉండాలని, చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలని సూచించారు. ప్రజలు ఠాణాలకు స్వేచ్ఛగా వచ్చి ఫిర్యాదులు ఇవ్వాలని, ఠాణాకు వచ్చే వారందరినీ సమాన దృష్టితో చూడాలని సిబ్బందికి సూచించారు. కేసుల దర్యాప్తు పారదర్శకంగా, వేగంగా జరగాలన్నారు. పెండెన్సీ ఉండవద్దని, కేసుల దర్యాప్తులో పక్కా సాక్ష్యాలను సేకరించి నిందితులకు శిక్షలు పక్కాగా పడేలా పకడ్బందీగా దర్యాప్తు ఉండాలన్నారు. ట్రాఫిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ అంశం నేరుగా ప్రజలతో సంబంధం ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్పై దృష్టి పెట్టాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడపురగని, దీనిపై ఉక్కు సంకల్పంతో పనిచేయాలన్నారు. డ్రగ్స్ను రాష్ట్రం నుంచి తరిమివేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని, ప్రజాపాలనలో ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ శివప్రసాద్, జాయింట్ సీపీలు గజారావు భూపాల్, పరిమళ హన నూతన్, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.