కార్వాన్, ఫిబ్రవరి 4 : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టప్పాచబుత్రా పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ ఎంఏ.జావిద్ తెలిపిన వివరాల ప్రకారం.. నట్రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇసాక్(33) కార్పెంటర్, ఇసాముద్దీన్ (26) ఫర్నిచర్ వర్క్ చేస్తుంటారు. కాగా గత ఏడు నెలల కిందట మహ్మద్ ఇసాక్ ఒరిస్సాకు చెందిన ఫర్నిచర్ కార్మికుడిగా పని చేసే రాజును కలిశాడు. ఈ క్రమంలో ఒరిస్సాలో గంజాయి రూ.4వేలకు కిలో లభిస్తుందని నగరానికి తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని పథకం వేశారు.
వీరితో ఈ కేసులో ఏ-2గా ఉన్న ఇసాముద్దీన్ కూడా కలిశాడు. ముగ్గురు కలిసి గంజాయి విక్రయిస్తుండగా సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, టప్పాచబుత్రా పోలీసులు పట్టుకొని 68 కేజీల గంజాయితో పాటు 5 మొబైల్ ఫోన్లు, ఇన్నోవా కారు, అక్టివా ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. రాజు పరారీలో ఉన్నట్లు ఏసీపీ జావిద్ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీనివాస్, డీఐ ఆసిఫ్, ఎస్ఐలు ఆమ్జద్ షరీఫ్, అంబేడ్కర్ పాల్గొన్నారు.