Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ):హుస్సే న్సాగర్ చుట్టూ ఉన్న తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల వారధిగా ఉన్న ట్యాంక్ బండ్ సుందరీకరణ కోసమే సుమారు రూ.27 కోట్లు వెచ్చించిన హెచ్ఎండీఏ అధికారులు నెక్లెస్ రోడ్డులోనూ అదే తరహాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.14.40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నెక్లెస్ రోడ్డులో ఇరువైపులా వాకర్స్, పాదచారులు, పర్యాటకులను ఆకట్టుకునేలా ఫుట్పాత్లను ఆధునీకరించనున్నారు. ఇందులో భాగంగా హెరిటేజ్ ఆర్కిటెక్చరల్ అర్నమెంటల్ డెకోరేటివ్ కాంబో స్ట్రీట్ లైట్స్ స్తంభాలు, అర్నమెంటల్ కాస్ట్ ఐరన్ గ్రిల్స్, ఫ్రీ కాస్ట్ ఫ్లాట్ బ్లాక్ వంటి కొత్తగా ఏర్పాటు చేసి చారిత్రకత ఉట్టిపడేటా నెక్లెస్ రోడ్డును ఆధునీకరించనున్నారు. ఐమ్యాక్స్ ఇందిరాగాంధీ రోటరీ నుంచి మొదలు కొని సంజీవయ్య పార్కు వద్ద ఉన్న పీవీ ఘాట్ వరకు మార్గాన్ని సరికొత్తగా అనుభూతినిచ్చేలా డిజైన్ చేశారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన చారిత్రాత్మక థీమ్ అందరినీ ఆకట్టుకోవడంతో, దాని తరహాలో హుస్సేన్సాగర్కు మరో ప్రధాన ఆకర్షణ అయిన నెక్లెస్ రోడ్డును ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. ఆధునీకరణ పూర్తయితే ఈ మార్గంలో సందర్శకులు, పర్యాటకులు హాయిగా గడిపేందుకు అనుకూలంగా ల్యాండ్ స్కేపింగ్ను చేయనున్నారు.
హుస్సేన్సాగర్ రూపురేఖలను పూర్తిగా మార్చివేసేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇటీవలే సాగర్లోని నీటి నాణ్యతను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోగా, తాజాగా నగర వాసులు రాకపోకలు సాగించే మార్గాలను అత్యాధునికంగా, ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. హుస్సేన్సాగర్ తీరం సందడికి కేరాఫ్ అడ్రస్. త్వరలోనే 3 ప్రత్యేకతలు ఈ ప్రాంతంలోనే రానున్నాయి. వాటిలో మొదటిది 125 అడుగులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కాగా, ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం, ఆ తర్వాత దానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సైతం రెండు నెలల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇవన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తే హుస్సేన్సాగర్ తీరమంతా పర్యాటకానికి కేంద్రంగా విరాజిల్లనున్నది. తెలుగుతల్లి విగ్రహం నుంచి మొదలు ట్యాంక్బండ్ మీదుగా రాణిగంజ్, సంజీవయ్యపార్కు, పీవీ ఘాట్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ ఇలా అన్ని ప్రాంతాలు హుస్సేన్సాగర్కు మరింత అదనపు హంగులతో అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ నగరాల అందాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా హుస్సేన్సాగర్ తీర ప్రాంతం నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుండటంతో ట్యాంక్బండ్పై ‘సన్డే ఫన్ డే’ పేరుతో ప్రభుత్వం సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నది.