ఒక అక్రమం చేయడం సాధారణం.. దాని ఆధారంగా ఇంకో అక్రమాన్ని సృష్టించడమే అసలైన విద్య. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ హయాంలో జరిగిన అక్రమాల్లో ప్రధానంగా ఇదే తరహా డబుల్ ధమాకా కనిపిస్తున్నది. కేవలం పాసు పుస్తకాల మీద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇంటి నంబర్లను జారీ చేసి… ఆపై ఆ ఇంటి నంబర్ల ఆధారంగానే నివాసాలులేని ప్రైవేటు వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ఈ జంట అక్రమాల్లో అధికారులకు దక్కినది గోరంత కాగా… వీరందరినీ పాత్రధారులుగా ఆడించిన అదృశ్య ‘హస్తం’ కొండంత ప్రజాధనాన్ని కొల్లగొట్టిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఏసీబీ, విజిలెన్స్ విచారణల్లో ఇంకా అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా చేతికి ఎముక లేకుండా అడ్డగోలుగా పనులు సృష్టించి.. బిల్లులు కొల్లగొట్టేలా వ్యూహం పన్నిన అధికారులు విచారణకు దొరకకుండా ఉండేందుకు తమకు తోచిన మార్గాల్లో ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఒకవైపు రాజకీయ నేతల్ని ఆశ్రయించి విచారణను ప్రభావితం చేసేందుకు తీవ్ర ఒత్తిడి తెస్తూనే మరోవైపు తాము సంతకాలు చేసిన ఫైల్స్ను విచారణకు దొరకకుండా మాయం చేయడం కూడా విజిలెన్స్ అధికారులనే నివ్వెరపోయేలా చేస్తున్నది.
– సిటీబ్యూరో/బడంగ్పేట్, మార్చి24 (నమస్తే తెలంగాణ)
బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి డొంకను కదిలించేందుకు పలు విభాగాల విచారణాధికారులు శ్రమటోడ్చాల్సి వస్తుంది. ఆదిలో హడావిడి చేసిన విజిలెన్స్ ఆపై విచారణను అటకెక్కించడంతో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. దీంతో అనివార్యంగా విజిలెన్స్ విభాగం మళ్లీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా సర్కిల్ కార్యాలయం విచారణలు… ఫైళ్ల పరిశీలనలతో అట్టుడికిపోతున్నది. అయితే తాజాగా కీలకమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. వరుస ఫిర్యాదులతో రెండు విభాగాలు అవినీతి గుట్టును వెలికితీసేందుకు ప్రయత్నిస్తుండగా… కొన్నిరోజుల ముందే ఆడిట్ విభాగం అధికారులు వచ్చి చాలా మేరకు ఫైల్స్ను ‘సంతృప్తికరంగా’ పరిశీలించి ‘ఆల్ గుడ్’ అని ధ్రువీకరించినట్లు ప్రచారం జరుగుతున్నది.
వాటిలో నుంచే ఇప్పుడు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు అవినీతిని తోడుతుండటం గమనార్హం. వాస్తవానికి కార్పొరేషన్ ఖజానాలో రూ.39 కోట్ల బడ్జెట్ ఉంటే ఏకంగా రూ.122 కోట్ల మేర పనులను ప్రతిపాదించి ఎడాపెడా బిల్లుల్ని దండుకున్నట్లు విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు తమ అవినీతి కత్తికి రెండువైపులా పదును పెట్టి… పాసు పుస్తకాలపైనే ఇంటి నెంబర్లను జారీ చేయడం తద్వారా ప్రైవేటు వెంచర్ల యజమానులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించినట్లు తెలిసింది.
తిరిగి అదే ఇంటి నెంబర్లను రికార్డుల్లో నమోదు చేసి ప్రైవేటు వెంచర్లలో భారీ ఎత్తున రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసమే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఒక్క కాంట్రాక్టరుకు ఏడాదిలోనే ఏకంగా రూ.13 కోట్ల బిల్లులు చెల్లించడమంటే దీనికి వెనక ఎంతటి అదృశ్య హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు టౌన్ ప్లానింగ్ అధికారులు అసైన్డ్, ప్రభుత్వ, వక్ఫ్ ఇలా విచ్చలవిడిగా అన్ని భూముల్లో నిర్మాణ అనుమతులు జారీ చేసినట్లుగా విచారణలో వెల్లడవుతున్నట్లు సమాచారం. అందుకే విజిలెన్స్ అధికారులు ఏకంగా 7300 అనుమతుల ఫైల్స్ను స్వాధీనం చేసుకొని పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
క్షేత్రస్థాయిలోకి విచారణ అధికారులు…
ఒకవైపు విచారణలు కొనసాగుతుండగానే మరోవైపు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల కిందట ఏసీబీ అధికారులకు మరో ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఓ సాధారణ కాంట్రాక్టరుకు ఏడాదిలోనే రూ.13 కోట్ల బిల్లులు చెల్లించగా అందులో రూ.30 లక్షల వరకు పనులు అసలు ముట్టనే ముట్టలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో పాటు జీహెచ్ఎంసీకి సమర్పించిన రూ. 122 కోట్ల పనుల జాబితాలో చాలావరకు పనులు అసంపూర్తిగా, అసలు గ్రౌండింగ్ కూడా కానివి ఉన్నాయని విచారణ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇందులో ఇప్పటికే రూ.40 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తి కాగా… ఫారం-8 దశలో మరో రూ.26 కోట్ల చెల్లింపులు ఉన్నట్లు సమాచారం. దీంతో బిల్లులు చెల్లించిన వాటిలో అసలు ఎన్ని పనులు చేశారు? ఎన్ని దొంగ పనులు? అనే దానిపైనా విజిలెన్స్ అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం కొన్ని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లారు. ఇంకోవైపు రూ.122 కోట్ల పనులకు సంబంధించి ఏ ఒక్క పనికి కూడా నోట్ ఫైల్ లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాలాచోట్ల కీలకమైన కమిషనర్, డీఈ సంతకాలు లేకుండా ఉండటమంటే ఎవరి కనుసన్నల్లో కార్యాలయంలో ఫైల్స్ కదలికలు జరుగుతున్నాయనేది ఇప్పుడు కీలకాంశంగా మారింది.
ఐక్యతను విచ్ఛిన్నం చేసిన విచారణలు
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు… బడంగ్పేట అక్రమాల్లోనూ అధికారులు పాత్రధారులైతే తెర వెనక సూత్రధారులూ ఉన్నారు. కానీ అధికారికంగా ఇప్పుడు అదికారులే తెర మీద కనిపిస్తుండటంతో సూత్రధారులు ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ రాజకీయంగా పావులు కదుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఆదిలో విజిలెన్స్ అధికారులు హడావిడి చేసి ఆపై మిన్నకుండటం… భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినప్పటికీ వేగంగా చర్యలు కనిపించకపోవడమే ఇందుకు ఉదాహరణలుగా పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పల్లీ బఠాణీల తీరు చేయడంలో ఐక్యంగా ఉన్న అధికారులు, సిబ్బంది విచారణలతో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకునేందుకు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇందులో భాగంగా అకౌంట్స్ విభాగంలో ఒక అధికారి తన సంతకం ఉన్న ఏకంగా 130కి పైగా ఫైల్స్ను మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి తనకేం సంబంధం? అని ఎదురు ప్రశ్నిస్తుండగా… అతనే ఫైల్స్ను తీసుకువెళ్లారని ఇతర సిబ్బంది ఉన్నతాధికారులకు చెబుతున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో ఫైల్స్ మాయంలో అమాయక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని బలి చేసేందుకు కూడా తెర వెనక వ్యూహం రచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు తామే కాదు… తమకంటే ముందు పని చేసిన వారి హయంలోనూ ఇదే రకమైన అక్రమాలు జరిగాయంటూ ఇప్పుడున్న అధికారులు కొంతమంది కొత్త వివాదానికి తెర లేపుతుండటంతో అవినీతి వ్యవహారం కాస్తా రాజకీయంగా మలుపు తీసుకుంటున్నది.