కార్ఖానాలో బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, చిత్రంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
లాస్య నందిత, బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి,బోర్డు మాజీ ఉపాధ్యక్షులు మహేశ్వర్రెడ్డి, తదితరులు
కంటోన్మెంట్, ఆగస్టు 27 : కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. కార్ఖానాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్యనందిత క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి తలసానితో పాటు బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మట్లాడుతూ రానున్న మూడు నెలలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అత్యంత కీలకంగా పని చేయాలని కోరారు. ఏ వార్డుకు వెళ్లినా 80 నుంచి 90 శాతం ఓటర్లు బీఆర్ఎస్ వారేనన్నారు. గతంతో పోల్చితే ప్రతి వార్డులో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. ప్రజల ఆశీస్సులు, అందరి ఐక్యత, సహాయ సహకారాలతో కంటోన్మెంట్లో లాస్యనందితను గెలుపించుకోవాలని సూచించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో వెయ్యి పడకల దవాఖాన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, గతంలో పదిరోజులకోమారు మంచినీళ్లు వచ్చేవని, సాయన్న కృషితోనే ఉచిత మంచినీటి పథకం కంటోన్మెంట్లో అమలవుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, నియోజకవర్గానికి దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన కృషిని ఇంటింటికీ వివరించాలన్నారు. సాయన్న నిత్యం ప్రజల మధ్య ఉండడం, ప్రభుత్వం నుంచి పనులు మంజూరు చేయించడం తప్ప ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు పొందలేదన్నారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు సామాజిక బాధ్యతతో ప్రజలకు సహాయ సహకారాలు అందించారని సూచించారు. ప్రతిపక్షాల చౌకబారు విమర్శలు, అసత్య ప్రచారాలకు ఎక్కడా కుంగిపోకుండా మనమంతా ప్రగతితోనే వారికి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడంలో కీలకప్రాత పోషిస్తున్న పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
విపక్ష పార్టీలు ఆలోచన చేయాలి
దివంగత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్కు చేసిన సేవలను గుర్తుంచుకొని ఆయన కుమార్తె లాస్యనందితను ఆశీర్వదించాలని కోరారు. ప్రతి సంక్షేమ పథకం అమలులో పార్టీలకు ఆతీతంగా సాయన్న వ్యవహరించారని, విపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా బేషరతుగా లాస్యనందితకు మద్దతు ఇవ్వాలని సూచించారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి అందరూ తోడ్పాటునందించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనతో సాయన్నపై ఉన్న గౌరవంతో లాస్యనందితకు టికెట్ కేటాయించారని తెలిపారు. అంతకుముందు సాయన్న నివాసంలో ఆయన కుటుంబసభ్యులతో మంత్రి తలసాని, మర్రి రాజశేఖర్రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు లోక్నాథం, నళినికిరణ్, అనితాప్రభాకర్, మార్కెట్ చైర్మన్ హారికాఆనంద్బాబు, వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్రెడ్డి, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, నయీమ్, భాస్కర్ ముదిరాజ్, ఆకుల హరి, జీహెచ్ఎంసీ మాజీ కో-ఆప్షన్ సభ్యులు నర్సింహ ముదిరాజ్, వంగూరు మల్లేశ్, ప్రభుగుప్తా, మురళీయాదవ్, సదానంద్గౌడ్, శ్రీకాంత్, పనస సంతోష్, కర్ణకుమార్, కిరణ్, సంతోష్, ధన్రాజ్, కుమార్, ఝాన్సీ, భవాని, తదితరులు పాల్గొన్నారు.