సుల్తాన్ బజార్, ఆగస్టు 15 : ఇంటర్మీడియట్ అనంతరం ఏం చదవాలి? ఎలాంటి చదువులు విద్యార్థుల రేపటి భవిత్యానికి భరోసాను కల్పిస్తాయి? లాంటి ఎన్నో సందేహాల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ మూడు రోజులుగా నివృత్తి చేసింది. ఏ చదువులు చదివితే తమ బిడ్డల బతుకులు బాగుంటాయని ఆలోచిస్తున్న తల్లిదండ్రులకు టీ-న్యూస్ ఆధ్వర్యంలో నిజాం కళాశాలలో నిర్వహించిన తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ పెక్కు సందేహాలను నివృత్తి చేసింది. అయితే, సోమవారంతో ఈ ఫెయిర్ ఘనంగా ముగిసిం ది. చివరి రోజు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఫెయిర్లో పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు స్టాళ్లను ఏర్పాటు చేసి తమ కళాశాల వాతావరణంతో పాటు విద్యా బోధన, ప్లేస్మెంట్ తదితర అంశాలపై విద్యార్థుల కు అవగాహన కల్పించారు. అంతే కాకుండా మాక్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులచే ఎటువంటి కోర్సు తీసుకుంటే బాగుంటుందని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. చివరి రోజున ఫెయిర్లో సీబీఐటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.శ్రీనివాస్ కమ్యూనికేషన్ స్కిల్పై అవగాహన కల్పించడంతో పాటు సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీ-న్యూస్ సీజీఎం ఉపేందర్, డీజీఎం కిర ణ్, మార్కెటింగ్ టీమ్ సభ్యులు సత్యపాల్, శ్రీనివాస్, భాస్కర్, వెంకట్రెడ్డి, సతీశ్తో పాటు విద్యార్థులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు.
ఐటీ రంగం ఎంతో అభివృద్ధి సాధించింది
విద్యార్థులు, తల్లిదండ్రులతో నేరుగా కలుసుకునేందుకు గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతగానో దోహద పడుతుంది. నేటి సమాజంలో అత్యధికంగా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుకే అధిక ఆసక్తి చూపుతున్నారు. సీఎస్ఈతో పాటు ఈఈఈ, కోర్ ఇంజనీరింగ్ కోర్సులకు అధిక డిమాండ్ ఉంది. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు క్రమ శిక్షణతో పాటు మంచి విద్యను అభ్యసించేందుకు ఎంతగానో దోహద పడతున్నాం. దీంతో పాటు పూర్తి స్థాయి ప్లేస్మెంట్ను కూడా కల్పిస్తున్నాం.
– అమిత్ బల్లా, హెడ్ అడ్మిన్, గురునానక్ ఇనిస్టిట్యూషన్స్
సీఎస్ఈనే కాకుండా.. ఇతర కోర్సులైతే బాగుంటుంది
నేటి సమాజంలో తల్లిదండ్రులు వారి పిల్లలు కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడం కోసం బీటెక్ సీఎస్ఈని ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం కాదు. ప్రతి ఒక్కరూ సీఎస్ఈని ఎంచుకోవడం ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విద్యార్థులు ఈసీ, ఈఈఈ, సివిల్స్ కోర్సులు తీసుకోవడం ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
– అంబాల శ్రీధర్, అడ్మిన్ అధికారి, పల్లవి ఇంజనీరింగ్ కళాశాల
క్యాంపస్ వాతావరణం ప్రశాంతంగా ఉంటే..
విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునే సమయంలో కళాశాల వాతావరణం ఎలా ఉంది? అక్కడ విద్యా బోధన ఎట్లా ఉంది? అనే విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాంపస్ వాతావరణం ప్రశాంతంగా ఉంటే.. ఆయా కళాశాలల్లో ప్లేస్మెంట్ శాతం అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు బీటెక్ సీఎస్ఈనే కావాలనుకోవడం సరైనది కాదు. మిగతా కోర్సులలో కూడా మంచి ఉపాధి లభిస్తుంది.
– ఆర్.వెంకటేశ్వర్ రావు, శ్రీ ఇందు ఇనిస్టిట్యూట్