సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : స్టార్ హోటల్ను అడ్డాగా చేసుకొని డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్న ఓ ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సోమవారం మీడియాకు వివరించారు. గచ్చిబౌలిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం రావడంతో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు హోటల్లో సోదాలు నిర్వహించారు. పోలీసులు వస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బీజేపీ నాయకుడు యోగానంద్ కొడుకు మంజీర గ్రూప్స్ డైరెక్టర్ వివేకానంద తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు పోలీసులు సమాచారం సేకరించి అతని ఇంటికి వెళ్లారు.
పోలీసులు ఇంట్లోకి రాకుండా డోర్ లాక్ చేయడంతో 5 గంటలు పోలీసులు వివేకానంద ఇంటి బయట ఎదురు చూసి చివరకు ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో ఉన్న డ్రగ్స్ను వాష్రూమ్లో పడేసి, సెల్ఫోన్లోని వాట్సాప్ చాటింగ్స్, కాంటాక్టులను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున వివేకానందను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించడంతో డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
అతనిని విచారించగా మరికొంత మంది పేర్లు వెల్లడించాడు. అందులో సయ్యద్ అబ్బాస్ అలియాస్ జాఫ్రీ, నిర్భయ్, కేదార్ను అదుపులో తీసుకొని పరీక్షించగా ఇద్దరికి డ్రగ్ వాడినట్లు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. పార్టీలో వీళ్లంతా కొకైన్ డ్రగ్ వాడినట్లు అనుమానిస్తున్నారు. 10 మంది కలిసి పార్టీ చేసుకోగా, ఆరుగురు పరారీలో ఉన్నారు. నిందితులకు డ్రగ్స్ సరఫరాపై ఆరా తీస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఓ తెలుగు సినీ నటుడి వ్యాపార భాగస్వామి శెలగంశెట్టి కేదార్నాథ్ అలియాస్ కేదర్ పట్టుబడడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేదార్నాథ్ ప్రైవేట్ ఛార్టెడ్ను కూడా నిర్వహిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులకు పంపిస్తుండేవాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సినీ నిర్మాతగా పలు సినిమాలు నిర్మిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.