మన్సూరాబాద్, ఆగస్టు 17: ఎల్బీనగర్ పోలీసులు ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరుపై స్పందించిన రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ గురువారం ఒక హెడ్ కానిస్టేబుల్, ఓ మహిళా కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు సీపీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు కూడా సీపీ ఆదేశించారని డీసీపీ తెలిపారు. ఇదిలా ఉండగా.. మహిళ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బాధితురాలు, ఆమె బంధువులు గురువారం ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి, ఆందోళన చేశారు. అనంతరం బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. మీర్పేటకు చెందిన మహిళ (42) భర్త చనిపోయాడు.
నందిహిల్స్లో ఉంటున్న తన తల్లి సోని వద్ద కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నది. ఇండ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఆమె కూతురు వివాహం ఇటీవలే నిశ్చయమైంది. కూతురు పెండ్లికి అవసరమయ్యే డబ్బుల కోసం దేవరకొండ, పడమటిపల్లి తండాలో ఉండే సోదరుడి వద్దకు వెళ్లింది. డబ్బులు తీసుకుని ఈనెల 15న రాత్రి 11 గంటల సమయంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్డుకు చేరుకుంది. నందిహిల్స్లో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఎల్బీనగర్ రింగ్రోడ్డులో వేచి ఉన్న ఆమె వద్దకు మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు వెళ్లారు. ఈ సమయంలో ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావంటూ.. ప్రశ్నించారు.
ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నానని ఆమె తెలిపినా.. పోలీసులు వినిపించుకోకుండా పెట్రోలింగ్ మొబైల్లో ఎల్బీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి కర్రలతో చితకబాదారని బాధితురాలు తెలిపారు. కొట్ట వద్దంటూ ప్రాధేయపడినా.. తన మాటలు వినిపించకుండా ఉండేందుకు నోటిలో బట్టలు పెట్టారని బాధితురాలు ఆరోపించింది. కూతురు పెండ్లి కోసం తమ్ముడి వద్ద అప్పుగా తీసుకొచ్చిన రూ.3 లక్షల నగదు, 3 తులాల బంగారు నగలు పోలీసులు తీసుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. సెల్ఫోన్ను లాక్కొని ఈనెల 16న ఉదయం 7 గంటలకు ఇంటికి పంపించారని తెలిపింది. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విషయం తెలుసుకున్న బంధువులు, గిరిజన సంఘాల నాయకులు బాధితురాలిని తీసుకుని గురువారం ఉదయం ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ ముందు బైఠాయించారు. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఆందోళన అనంతరం.. సదరు బాధిత మహిళను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
పోలీసులపై చర్యలు తీసుకోవాలి: గిరిజన సంఘం నాయకులు
మహిళ అని చూడకుండా రాత్రంతా పోలీస్స్టేషన్లో ఉంచి కర్రలతో విచక్షణా రహితంగా కొట్టిన ఎల్బీనగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.గాంధీనాయక్, సీపీఐ పార్టీ గ్రేటర్ కౌన్సిల్ మెంబర్ సక్రి బాయ్ డిమాండ్ చేశారు. ఊరి నుంచి వచ్చి, ఎల్బీనగర్ రింగ్రోడ్డు నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం చూస్తున్న బాధితురాలిని పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టడం దారుణమన్నారు. మద్యం తాగి ఎదురు తిరగడంతో కొట్టామంటూ పోలీసులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మహిళ అని చూడకండా.. చెప్పరాని చోట పోలీసులు కొట్టడం హేయమైన చర్య అన్నారు. బాధితురాలికి సరైన చికిత్సను అందజేసి బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి సత్యవతి రోథోడ్
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : అర్ధరాత్రి మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి స్వయంగా రాచకొండ పోలీస్ కమిషనర్కు ఫోన్చేసి ఘటనపై ఆరా తీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ చౌహాన్ను మంత్రి ఆదేశించారు. మహిళపై ఎల్బీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
బాధ్యులైన ఇద్దరిపై వేటు: డీసీపీ బి.సాయిశ్రీ
ఓ మహిళను రాత్రంతా పోలీస్స్టేషన్లో ఉంచి, కొట్టిన ఘటనలో ఎల్బీనగర్ పోలీస్స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు. ఈ ఘటనపై సీపీ విచారణకు ఆదేశించారని, ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత సస్పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి సీపీ డీఎస్ చౌహాన్కు నివేదిక అందజేస్తామన్నారు. ఈనెల 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలితో పాటు మరో ఇద్దరు మహిళలు రోడ్డుపై నిలబడి ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో వ్యవహరించడంతో మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు వారిని ఎల్బీనగర్ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారని తెలిపారు. పెట్టి కేసు పెట్టి పంపించాలంటూ సెక్షన్ ఇంచార్జికి చెప్పి మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు వెళ్లి పోయారన్నారు. అనంతరం అక్కడ ఏం జరిగింది.. అనే దానిపై విచారణలో తేలుతుందని తెలిపారు. మహిళను రాత్రంతా ఉంచాల్సింది కాదని.. ఈ విషయంలో హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.