సిటీబ్యూరో: విద్యాసంస్థలు పునః ప్రారంభం కాబోతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని బుధవారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫెట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. చాలా వరకు ఫిట్నెస్ లేని వాహనాలు, ఓవర్ లోడింగ్తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మోటార్ వాహన చట్టం ప్రకారం విద్యాసంస్థల బస్సులు పాటించాల్సిన నిబంధనలు అన్ని సరైన విధంగా ఉండాలని సూచించారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తదితర భద్రతా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. విద్యార్థుల భద్రత బాధ్యత విద్యాసంస్థలదేనని అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలు ముందుగానే నిర్ధారించుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఎక్కించుకుని ఆటో, వ్యాన్, బస్సులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుభవం లేని డ్రైవర్ను నియమిస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.