మియాపూర్ : ప్రయాణీకులకు మెరుగైన రవాణా వసతులను అందిస్తున్న ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని, తద్వారా మరింతగా వారి సేవలో తరించేందుకు తోడ్పాటును అందించాలని కళాబృందం కోరింది. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మియాపూర్ ఆర్టీసీ బస్ డిపో1 ఆధ్వర్యంలో జోనల్ కల్చరల్ బృందం ఆధ్వర్యంలో డిపో పరిధిలోని మియాపూర్ కూడలి, బోల్లారం కూడలి, కేపీహెచ్బీ ప్రధాన రహదారులపై ఆర్టీసీ సేవలను వివరిస్తూ పలు ప్రదర్శనలను నిర్వహించారు.
కళా బృందం ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా మియాపూర్ డిపో1 డీఎం సురేశ్ మాట్లాడుతూ సురక్షితమైన ప్రమాదరహితమైన ప్రయాణానికి ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రయాణికుల సేవే లక్ష్యంగా ఆర్టీసీ కృషి చేస్తున్నదని, ప్రతిఫలంగా ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించటం ద్వారా మరింత బలోపేతం అయి సేవల విస్తృతికి మద్దతు నివ్వాలని ఆయన కోరారు.
ప్రయాణీకులకు రవాణా సౌకర్యంతో పాటు కార్గో సేవలను సైతం అందిస్తున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలని డీఎం సురేశ్ విన్నవించారు. ఈకార్యక్రమంలో ఏఎంటీ వెంకటేశ్వర్లు, కల్చరల్ కమిటీ ప్రతినిధులు , సిబ్బంది పాల్గొన్నారు.