సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు దవాఖానలపై సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడుతున్నది. దీంతో చాలా దవాఖానలు, క్లినిక్లలో అర్హత లేని వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుండగా.. మరికొన్ని దవాఖానల్లో డబ్బుల కోసం అవసరం లేని చికిత్స, చనిపోయిన రోగులకు వెంటీలెటర్లు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో తరచూ అనుమానాస్పద మరణాలు జరుగుతున్నాయి.
అయితే ఘటన జరిగిన రెండు మూడు రోజులు హడావిడి చేస్తున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు.. అటు బాధిత కుటుంబానికి, ఇటు దవాఖానల యాజమాన్యాలతో సెటిల్మెంట్లు కుదుర్చడం పరిపాటిగా మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గచ్చిబౌలిలో పేరున్న ఓ కార్పొరేట్ దవాఖానలో రోగి మృతిచెందిన తరువాత కూడా కుటుంబసభ్యులకు చూపించకుండా చికిత్స పేరుతో వెంటిలెటర్పై ఉంచి, లక్షల రూపాయల బిల్లులు వసూలు చేసి.. మొత్తం బిల్లులు చెల్లించిన తరువాత మృతదే హాన్ని అప్పగించిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.
పోలీస్స్టేషన్లో కేసు నమోదైనా.. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు..ఇటు పోలీసులు సదరు దవాఖాన యాజమాన్యంతో కలిసి ఆందోళన చేసిన బాధిత కుటుంబానికి సెటిల్మెంట్ చేసి.. జరిగిన తప్పు బయటకు పొక్కకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇబ్రహీంపట్నం మండలం, పోల్కంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మన్నెగూడలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే అక్కడి వైద్యులు మాత్రం చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసి.. తీరా పరిస్థితి విషమంగా ఉందంటూ చెప్పారని, తాము గాంధీ దవాఖానకు తీసుకెళ్తామని చెప్పడంతో అప్పుడు రోగి మృతిచెందినట్లు చెప్పారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తూ.. ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ అధికారులు, ఇటు పోలీసులు ఎట్టకేలకు బాధిత కుటుంబానికి దవాఖాన యాజమాన్యంతో సెటిల్మెంట్ చేయించినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అసలేం ఏం జరిగిందో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సరైన దర్యాప్తు చేపట్టిన దాఖలాలు లేవని రోగులు ఆరోపిస్తున్నారు. కాగా, ప్రైవేటు దవాఖానలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏవైన ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కేవలం మొక్కుబడి తనిఖీలు చేసి.. అనంతరం సంబంధిత దవాఖానలు, క్లినిక్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.