సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): వేరెవరో చేతబడి ప్రయోగం చేయడం వల్లే తన జీవితంలో దరిద్రం తాండవిస్తున్నదన్న మూఢ నమ్మకమే ఉప్పల్లో పూజారిని, అతడి కుమారుడిని హత్య చేయించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్లో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురు నిందితులను మల్కాజిగిరి ఎస్ఓటీ సహకారంతో ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ మహేశ్ భగవత్ మంగళవారం వెల్లడించారు.
బాలాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన లిక్కి వినయ్ యోగేందర్రెడ్డి అలియాస్ వినయ్ ఫైనాన్స్ వ్యాపారి. అతడి తండ్రి పరమ యోగేందర్రెడ్డి 1991లో తుకారాంగేట్ ప్రాంతంలో రాజకీయ కక్షల నేపథ్యంలో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో వినయ్ కుటుంబ సభ్యులు ఉప్పల్లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చి.. అక్కడే ఉంటున్నారు. ఈ సమయంలో వినయ్ మేనమామ జంగారెడ్డి, అదే ప్రాంతంలో నివాసముండే పూజారి నర్సిమ్ల నర్సింహశర్మ (75) వద్దకు వెళ్లేవాడు. ఆ సమయంలో అతడిని వినయ్ తాతా అంటూ పిలుస్తూ, ఆ పూజలకు ఆకర్షితుడయ్యాడు. పూజలతో ఏదైనా సాధించవచ్చనే భ్రమలోకి వెళ్లాడు. 2016లో ఎస్ఐ పరీక్ష రాసిన వినయ్.. ఆ తర్వాత తనకు ఉద్యోగం రావాలని పూజలు చేసేందుకు నర్సింహశర్మకు రూ.6 లక్షలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పించాలంటూ కిస్మత్పూర్కు చెందిన వలీ అనే వ్యక్తికి రూ.12.50 లక్షలు ఇచ్చాడు. జాబ్ రాకపోవడంతో వలీ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేసినా.. నర్సింహశర్మ మాత్రం ఇవ్వలేదు.
అన్నింటికీ పూజలే దారి అని..
వినయ్ వరుణ్ అనే ఓ కాంట్రాక్టర్కు రూ.13.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అవి తిరిగి రాకపోవడంతో రూ.40 వేలు ఇచ్చి నర్సింహశర్మతో పూజ చేయించాడు. పూజ వల్ల మొత్తం తిరిగి ఇచ్చేస్తాడని.. అందులో రూ.3 లక్షలు తనకు ఇవ్వాలని పూజారి షరతు విధించాడు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ తీసుకున్న డబ్బులో సగం ఇచ్చేయడంతో అందులో రూ.1.5 లక్షలు పూజారి తీసుకున్నాడు.
ఆనారోగ్యం.. ఆర్థికంగా నష్టాలు..
ఆ తర్వాత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వినయ్కు.. ఆర్థికంగా కష్టాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలోనే పహాడీషరీఫ్ ఠాణాలో అతనిపై ఒక కేసు కూడా నమోదైంది. దీంతో నర్సింహశర్మే తనపై చేతబడి చేశాడని అనుమానం పెంచుకున్నాడు. అతన్ని చంపితేనే తనకు మంచి జరుగుతుందని భావించాడు.
పక్కా ప్లాన్ ప్రకారం..
ఈనెల 14న ఉదయం 5.45 గంటల ప్రాంతంలో పనిమనిషి రావడంతో నర్సింహశర్మ తలుపు తీశాడు. ఆమెను బెదిరిస్తూ ఇంట్లోకి వెళ్లిన వినయ్, బాలకృష్ణ నర్సింహశర్మను హత్య చేశారు. అరుపులు విని కొడుకు శ్రీనివాస్ కిందకు రావడంతో అతడిపై కూడా దాడి చేశారు. హత్య చేసి పరారయ్యేందుకు కావాల్సిన ద్విచక్ర వాహనాలు, డబ్బును కార్తీక్, సుధాకర్రెడ్డి సమకూర్చారు. వినయ్ బట్టలపై పడిన రక్తపు మరకలను అతడి తల్లి సావిత్రి శుభ్రం చేసింది. ఇదిలాఉండగా.. నిందితులు వినయ్, బాలకృష్ణను సోమవారం సాయంత్రం సుచిత్ర జంక్షన్లో, జగదీశ్గౌడ్, రామ్, శ్యామ్సుందర్ను మంగళవారం ఎంజీబీఎస్ బస్స్టాండ్లో అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఓటీ, ఉప్పల్ పోలీస్ బృందాన్ని సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, మల్కాజిగిరి ఏసీపీ నరేశ్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు గోవింద్ రెడ్డి, రాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
హాస్టల్లో ఉండి రెక్కీ..
తన స్నేహితుడైన చంపాపేటకు చెందిన యల్ల బాలకృష్ణ అలియాస్ బాల్, మామిడిపల్లికి చెందిన లాల్ జగదీశ్గౌడ్, ఆసిఫ్నగర్కు చెందిన గన్వయ రామ్, ఫిల్మ్నగర్కు చెందిన గైక్వాడ్ శ్యాంసుందర్, గడ్డి కార్తీక్, వాకిటి సుధాకర్రెడ్డి, లిక్కి సావిత్రి కలిసి నర్సింహశర్మను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మృతుడి ఇంటి ముందు ఉన్న వెంకటేశ్వర డీలక్స్ బాయ్స్ హాస్టల్లో రామ్కు ఆశ్రయం కల్పించారు. అక్కడి నుంచి నర్సింహశర్మ ఇంటికి వచ్చిపోయే వారి వివరాలన్నీ రామ్ మిగతా వారికి చేరవేశాడు.
గ్రహాలు బాగులేవు.. విదేశాలకు వెళ్లు
2019లో ఉద్యోగం కోసమని వినయ్ మళ్లీ నర్సింహశర్మ దగ్గరికి వెళ్లాడు. అయితే నీకు గ్రహాలు అనుకూలంగా లేవు.. విదేశాలకు వెళ్లమని పూజారి వినయ్కు సూచించాడు. అందుకోసం రూ.11 వేలు తీసుకొని పూజ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన వినయ్.. లాక్డౌన్ కారణంగా 2020 సెప్టెంబర్లో తిరిగి వచ్చేశాడు. పూజ చేసినా ఉద్యోగం రాలేదన్న కోపంలో ఉన్న వినయ్.. ఎస్సై ఉద్యోగం కోసం ఇచ్చిన రూ.6 లక్షలు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చాడు.