సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ట్యాంక్బండ్ అరుగు.. చార్మినార్ గచ్చులే వారికి ఉపాధి కేంద్రాలు. పర్యాటక ప్రాంతాలే వేదికలు. తమ టాలెంట్తో కళాకారులు, వ్యాపారులు ఉపాధిని సృష్టించుకుంటున్నారు. లాభాలు గడిస్తున్నారు. ట్యాంక్బండ్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సండే ఫన్డేలతో ఆ ప్రాంతాల్లో సందర్శకుల తాకిడి పెరిగింది. ఆహ్లాదంగా గడపడానికి లక్షలాది మంది అక్కడికి వెళుతున్నారు. దీంతో అక్కడ వ్యాపార కార్యకలాపాలు పెరిగాయి. ఈ అవకాశాన్ని కొందరు అందిపుచ్చుకుంటున్నారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా సొంత టాలెంట్తో ఆదాయాన్ని గడిస్తున్నారు. స్కెచింగ్ ఆర్ట్, టాటూ, జాతకం చెబుతూ ఇలా విభిన్న మార్గాల్లో నెలకు రూ.30వేలకు పైగా ఆర్జిస్తున్నారు. వ్యాపారులైతే నెలకు రూ.50వేలకు పైగానే సంపాదిస్తున్నారు. జీవితంలో స్థిరపడాలంటే కొలువు వచ్చే వరకు ఎదురుచూడనక్కర్లేదు. టాలెంట్తో డబ్బులు సంపాదించి స్థిరపడొచ్చని నిరూపిస్తున్నారు కొందరు.
నిలబెట్టి.. మన బొమ్మ గీస్తారు
ఫొటోలకు ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉంది. సెల్ఫీల జోరు నడుస్తున్నా పేపర్ స్కెచింగ్ ఫొటోకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ట్యాంక్బండ్ పరిసరాల్లో పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్టులు గీసే చిత్రాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఫిల్మ్నగర్కు చెందిన సాయి రామ్ పెన్సిల్ స్కెచ్ వేయడంలో దిట్ట. కేవలం నాలుగు నిమిషాల్లో ఎవరి బొమ్మనైనా గీసి చూపిస్తాడు. చిన్నప్పటి నుంచే ఆర్ట్పై ఇష్టం పెంచుకున్న తాను ఎవరైనా గోడలపై ఆర్ట్ వేస్తుంటే అక్కడకి వెళ్లి చూసేవాడు. ఆర్టిస్టులు ఎక్కడైనా స్కెచింగ్ వేస్తుంటే గమనించేవాడు. అలా ఆ విద్యను నేర్చుకుని ఉపాధి పొందుతున్నాడు. చంపాపేట్కు చెందిన రాము చార్మినార్ వద్ద పేపర్ స్కెచింగ్ వేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నాడు. ఒక్కరి ఫొటో గీస్తే రూ.200లు తీసుకుంటాడు. రోజుకు కనీసం ఐదుగురి ఫొటోలనైనా గీస్తామంటూ చెబుతున్నారు.
టాటూస్ వేద్దాం.. ఫ్యాషన్ చూపిద్దాం..!!
టాటూలకు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. నూతన డిజైన్లతో డిజైనర్లు ఉపాధి సృష్టించుకుంటున్నారు. ముషీరాబాద్కు చెందిన శ్రీను, ముస్తఫా తదితరులు ట్యాంక్బండ్పై టాటూ షాపులను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఒక్కరికి డిజైన్ అతికించడానికి, వేయడానికి రూ.300లు పైనే తీసుకుంటున్నారు. ఇక గోల్కొండ పరిసరాల్లో జాతకం చెబుతూ ఉపాధి సృష్టించుకుంటున్నారు చాలా మంది. చిలక జోస్యం, చేయి చూస్తూ రేఖల ఆధారంగా జీవితం ఎలా ఉంటుందో జోస్యం చెబుతున్నారు. పర్యాటక ప్రాంతాలకు వచ్చిన వారికి దిల్సుఖ్నగర్కు చెందిన శ్రీకాంత్తో పాటు అనేక మంది జోస్యం చెబుతూ ఉపాధి పొందుతున్నారు.
చిలక జోస్యానికి డిమాండ్ తగ్గలేదు
20 ఏండ్ల నుంచి జాతకం చెబుతున్నా. పర్యాటక పరిసరాలే మా కార్యాలయాలు. జాతకం చెప్పించుకునే వాళ్లు కొంత తగ్గినా.. యువత ఆసక్తి చూపించడం పెరిగింది. రేఖల ఆధారంగా జీవితం ఎలా ఉంటుందో చెప్పడం తాత, ముత్తాతల నుంచి నేర్చుకున్నా. ప్రేమికులు ఎక్కువగా జాతకం చెప్పించుకుంటున్నారు. చిలక జోస్యాన్ని అటవీ శాఖాధికారులు వద్దంటున్నారు. సండే ఫన్డే కాన్సెప్ట్తో మా బిజినెస్ పెరిగింది. ఎటువంటి పెట్టుబడి లేకుండా నాకు వచ్చిన విద్యతో ఆదాయం పొందుతున్నా. సాధారణ రోజుల్లో రోజుకు రూ.6 వందలు వస్తే సండే ఫన్ డే రోజు కనీసం 13 వందల వరకు సంపాదిస్తా.
ఫన్డేతోనే మాకు ఉపాధి..
సండే ఫన్డే కాన్సెప్ట్ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ పెంచింది. దీంతో మాకు ఉపాధి దొరుకుతుంది. టూరిస్టులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడే మాకు బిజినెస్ అవుతుంది. ప్రభుత్వ కొలువు రాకపోతే దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనకున్న టాలెంట్తో కూడా జీవితంలో ఎదుగొచ్చు. మొన్నటి వరకు పేపర్ స్కెచింగ్ వేస్తూ బిజినెస్ నడిపించా. ఇప్పుడు టెక్నాలజీ విస్తరించింది. వాట్సాప్, ఫేస్బుక్లో కూడా నాకు ఫొటోలు పంపిస్తే చిత్రాలు గీసి పంపుతూ ఆదాయం పొందుతున్నా. జీవితంలో ఎదగాలంటే మన లోని టాలెంట్ను బలంగా నమ్ముకోవాలి.