హైదరాబాద్ : గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదు అవుతుండటంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. సాధారణంగా మేఘాలు ఉన్నప్పుడు అవి సూర్యకిరణాలకు అడ్డుగా ఉండడం వల్ల ఎండ తీవ్రత మనపై పడదని, మేఘాలు లేనప్పుడు సూర్యకిరణాలు నేరుగా భూమిమీద పడడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించారు.
వేసవితో పోల్చితే ఆ ఉష్ణోగ్రతలు తక్కువేనని, వరుసగా కురిసిన వానలతో చల్లటి వాతావరణానికి అలవాటు పడడం వల్ల చిన్నపాటి ఎండలు కూడా వేడిగా తలపిస్తున్నట్లు ఆమె తెలిపారు. వర్షాకాలంలో ఈపాటి ఎండలు సర్వసాధారణమేనని డైరెక్టర్ నాగరత్న స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఉత్తర కర్ణాటక నుంచి తమిళనాడు, మరఠ్వాడ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.