బంజారాహిల్స్,జూన్ 13: పెండ్లికి ఒప్పుకోకుంటే చంపేస్తానంటూ ప్రియుడి బెదిరింపులు.. మైనార్టీ తీరకుండా పెండ్లి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయంటూ తల్లిదండ్రుల బుజ్జగింపులు.. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయిన ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ, తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలోని ఎస్సీ కాలనీకి చెందిన కండ్రకోట దుర్గాభవానీ(16) ఐదో తరగతి చదివి ఇంట్లోనే ఉంటోంది. కొంతకాలంగా కల్యాణ్ అనే యువకుడితో స్నేహం ఉంది.
దీంతో ప్రేమిస్తున్నాను.. పెండ్లి చేసుకుంటానంటూ బాలికపై ఒత్తిడి తెస్తున్నాడు. విషయం దుర్గాభవానీ ఇంట్లో తెలియడంతో వారు .. ఆమెను మందలించారు. మైనార్టీ తీరకుండా పెండ్లి చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయని నచ్చజెప్పేందుకు యత్నించారు. దీంతో 5 రోజుల క్రితం ఇంట్లోంచి బయటకు వచ్చిన దుర్గాభవానీ.. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న తన సోదరి వెంకటలక్ష్మి వద్ద ఉంటుంది.. ఈ విషయాన్ని వెంకటలక్ష్మి.. తండ్రి కండ్రకోట శాంసన్కు తెలిపింది.
దాంతో శనివారం ఉదయం శ్యాంసన్ నగరానికి వచ్చి..కూతురికి నచ్చజెప్పాడు. ఈ క్రమంలో కల్యాణ్ వచ్చి ‘మీ కూతుర్ని పెండ్లి చేసుకుంటానని..అడ్డుచెబితే నీతో పాటు నీ కూతుర్ని చంపేస్తానంటూ..’ బెదిరించాడు. అయితే తన కూతురికి మైనార్టీ తీరిన తర్వాత పెండ్లి చేస్తానని చెప్పగా.. వినిపించుకోకుండా కల్యాణ్ బెదిరించి వెళ్లిపోయాడు. అనంతరం తండ్రి శ్యాంసన్తో పాటు మిగిలిన వారు బయటకు వెళ్లారు. శనివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న దుర్గాభవానీ చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి దుర్గాభవానీ ఆత్మహత్య చేసుకుని ఉంది. తన కుమార్తె మృతికి కల్యాణ్ అనే యువకుడి బెదిరింపులే కారణమంటూ మృతురాలి తండ్రి శ్యాంసన్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.