సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి వల్ల నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిసాయి. సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం జీడిమెట్లలో 1.5సెం.మీలు, అల్వాల్లో 6.3మిల్లీ మీటర్లు, పాశమైలారంలో 6.0మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురియనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కిందిస్థాయి గాలుల ప్రభావంతో ఎండలు ఎక్కువై జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలు, గాలిలో తేమ 43 శాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు.