కీసర, జనవరి 16 : కీసర మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధిహామీ పనులు విజయవంతంగా పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వచ్చే ఏప్రిల్ వరకు గడువు ఉన్నా.. మండలంలో పనులు ముందుగానే పూర్తి చేశామని అధికారులు పేర్కొన్నారు. మండలంలోని 10 పంచాయతీల్లో మొత్తం 100 రోజుల్లో 3772 మందికి ఉపాధి కల్పించారు. ఉపాధిహామీ కూలీల ద్వారా డంపింగ్యార్డు 10, ప్రకృతి వనాలు 10, నర్సరీలు 10, పది వైకుంఠధామాల్లో మొత్తం 78 రకాల పనులు పూర్తి చేయించామని చెప్పారు. మొత్తం ఉపాధిహామీలో మండలంలోని 10 పంచాయతీల్లో సుమారు రూ. 38.8లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మండలంలో మొత్తం 3176 మంది కూలీలకు జాబ్కార్డులిచ్చారు. ఇంకా కొత్త కార్డులు 400 మందికి వరకు పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాదిలో దాదాపు అన్ని కుటుంబాలకు వంద రోజుల పని కల్పించినట్లు వారు పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల్లో పనిచేయించినట్లు పేర్కొన్నారు.
ప్రతి పంచాయతీలో పనులు చేయించాం..
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండలంలో ఉపాధిహామీ పనులను పూర్తి సక్సెస్ చేశాం. ఉపాధిహామీ కోసం మండలంలో వచ్చే ఏప్రిల్ వరకు గడువు ఉన్నా..కూడా 100 రోజుల్లో పూర్తి ప్రగతి సాధించాం. ఉపాధిహామీ పనులకు మొత్తం రూ.38.8లక్షలతో పనులు పూర్తి చేశాం. ఉపాధిహామీ కూలీలతో మండలంలోని 10 పంచాయతీల్లో యాదాద్రి ప్లాంటేషన్లో 45వేల మొక్కలు నాటించాం. ఇంకా పలు అభివృద్ధి పనులకు ఉపాధిహామీ కూలీలను ఉపయోగించుకున్నాం.
-పద్మావతి,ఎంపీడీవో, కీసర