బంజారాహిల్స్, మార్చి 23 : బంజారాహిల్స్ రోడ్డు నెం 10 లోని పలు బస్తీలు, కాలనీల్లో నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు టీజీపీడీసీఎల్ ఆధ్వర్యంలో కొత్తగా 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మించనున్నారు. దీనికోసం షేక్పేట మండలం సర్వే నెంబర్ 403, టీఎస్ నెం 4, బ్లాక్ జీ వార్డు10 లో1500 గజాల స్థలాన్ని కేటాయించారు.
గత ఏడాది డిసెంబర్లో విద్యుత్శాఖ నుంచి సబ్ స్టేషన్ కోసం స్థలం కావాలంటూ ప్రతిపాదనలు రావడంతో నెలన్నర క్రితం షేక్పేట రెవెన్యూ అధికారులు పంచనామా చేసి స్థలాన్ని విద్యుత్శాఖకు అప్పగించారు. ఇక్కడ సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. కాగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయంలో తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా రెవెన్యూశాఖ, విద్యుత్శాఖ నిర్ణయం తీసుకోవడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
తనకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం1000 గజాల స్థలం ఇవ్వాలంటూ ఏడాదిన్నర నుంచి అడుగుతుంటే పట్టించుకోవడం లేదని, తనకు తెలియకుండా సబ్ స్టేషన్ నిర్మిస్తే తాను ఎందుకు ఊరుకుంటానంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభం అవుతుందా లేదా అనే విషయంపై విభిన్నమైన అభిప్రాయాలున్నారు.
ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మిస్తే అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని సబ్ స్టేషన్ల పరిధిలో సైతం నాణ్యమైన విద్యుత్ను అందించగలుగుతామని విద్యుత్శాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల అనంతరం సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందా.. లేకపోతే ఎమ్మెల్యే ఒత్తిడితో ఈ స్థలాన్ని క్యాంపు కార్యాలయానికి కేటాయిస్తారా అని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.