వసతి గృహాల వేటలో ఉద్యోగాభ్యర్థులు
పోటీ పరీక్షల సెంటర్ల ప్రాంతాల్లో భారీ డిమాండ్
టెట్ నోటిఫికేషన్తో పెరిగిన రద్దీ
అన్ని వసతులంటేనే ఓకే అంటున్న అభ్యర్థులు
సిటీబ్యూరో, మార్చి 27 : పోటీ పరీక్షలు అనగానే నగరంలో అశోక్నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిమాయత్నగర్, నల్లకుంట లాంటి కొన్ని ప్రాంతాలు ఠక్కున గుర్తుకొస్తాయి. ఈ ప్రాంతాల్లో సివిల్స్, గ్రూప్-1, 2, 3, 4 కోసం ప్రిపేర్ అయ్యేవారి కోసం కోచింగ్ సెంటర్లు డజన్ల కొద్దీ ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎటుచూసినా ఉద్యోగార్థులు పుస్తకాలు పట్టుకొని, కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటారు. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ అతిసమీపంలో ఉండడం, స్టడీ మెటీరియల్, జిరాక్స్ సెంటర్లు, పలు పబ్లికేషన్ల పుస్తకాలు ఇక్కడే దొరుకడమూ ఒక కారణం.
టెట్ నోటిఫికేషన్ రావడంతో..
టెట్ నోటిఫికేషన్ రానేవచ్చింది. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ రానున్న తరుణంలో వసతిగృహాల వేటలో ఉద్యోగార్థులు నిమగ్నమయ్యారు. సమ్మర్ సీజన్ కావడంతో వెంటిలేషన్ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని, చదువుకు అంతరాయం ఏర్పడదని అభ్యర్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వసతులను బట్టి నెలకు రూ. 4 వేల నుంచి రూ. 8వేలకు పైగా ఫీజు చెల్లిస్తున్నట్లు అభ్యర్థులు, ప్రైవేటు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
సాధారణ వాష్రూమ్స్తో పాటు అల్పాహారం, మధ్యాహ్నం-రాత్రి భోజనం అందజేస్తున్నారని, పప్పు, సాంబార్, ఒక కర్రీ ఇస్తున్నట్లు సురేశ్ అనే అభ్యర్థి పేర్కొన్నారు. దీంతోపాటు వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నలుగురు అభ్యర్థులు కలిసి ఒక రూంను షేర్ చేసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రత్యేక రూమ్లైతే నెలకు రూ.7 వేల నుంచి 7500 వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరూ లేదా ముగ్గురు ఉంటే రూ.5వేల నుంచి 5500 వరకు ఫీజు తగ్గుతుందని చెప్పారు. ప్రత్యేక ఏసీ గది అవరమైతే రూ.8500 నుంచి రూ.10వేల వరకు ఫీజు ఉంటుందని చెప్పారు. ఈ విధానాన్నే నగరంలోని అన్ని హాస్టళ్ల నిర్వాహకులు అమలు చేస్తున్నట్లు అశోక్నగర్లోని ఓ హాస్టల్ వార్డెన్ తెలిపారు.
వసతులుంటేనే చదువగలం
హాస్టళ్లలో అన్ని వసతులు ఉండాలి. పోషకాహారం, గాలి, వెలుతురు, సీటింగ్తో పాటు మంచాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. చుట్టూ వాతావరణం బాగుంటేనే చదివింది గుర్తుంచుకోగలం. అందుకే మనస్థాయికి దగ్గట్టు ఒక మంచి హాస్టల్ను చూసుకొని ఉండాలి. హాస్టల్ నుంచి కోచింగ్ సెంటర్కు, అక్కడి నుంచి లైబ్రరీకి.. ఇట్లా మన మనసును అదుపులో పెట్టుకొని చదివితే.. పాకెట్ మనీ రూ.1500 చాలు.
– చంద్రశేఖర్, గ్రూప్-1 అభ్యర్థి