అప్పుడు వాహనాల రద్దీ ఇంతగా పెరుగుతుందని ఊహించలేదు.. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చివరకు ఇంటర్చేంజ్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చునని నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) అధికారులు నార్సింగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఇంటర్చేంజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాహనాలు సాఫీగా సాగిపోయేలా కొత్తగా చేపట్టిన ఇంటర్చేంజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) :ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ కారిడార్ ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. నార్సింగి చుట్టు పక్కల ప్రాంతాలన్నీ ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలకు కేరాఫ్గా మారాయి. ఇంటర్చేంజ్ నిర్మించాల్సిన చోట కేవలం ఫ్లై ఓవర్ నిర్మించడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. దీంతో నార్సింగి వద్ద ఇంటర్చేంజ్ నిర్మించి సమస్యను పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే గండిపేట నుంచి వచ్చే మూసీ నదికి తోడు మెహిదీపట్నం నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో భూసేకరణ చేయకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. దీంతో గత ఏడాది కాలంగా నార్సింగి ఇంటర్చేంజ్ పనులకు సాంకేతికంగా అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా ఇంజినీరింగ్ అధికారులు భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా కొత్త మార్గాన్ని ప్రతిపాదించడంతో పనులు చకచకా పూర్తయ్యాయి. టోల్ వసూలు కోసం ప్రత్యేంగా షెడ్డు నిర్మాణం, యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
రోటరీ చుట్టూ తిరిగి ఓఆర్ఆర్ పైకి వెళ్లేలా..
నార్సింగి ఓఆర్ఆర్ వద్ద కొత్తగా నిర్మించిన ఇంటర్చేంజ్లో వాహనాలు ఓఆర్ఆర్ పైకి ఎక్కేవిధంగా ర్యాంపులు నిర్మించేందుకు సరిపడా స్థలం లేదు. దీంతో వాహనాలు రోటరీ చుట్టు తిరిగి ప్రీ లెఫ్ట్ తీసుకొని నేరుగా ఓఆర్ఆర్ పైకి వెళ్లేలా మార్గాన్ని నిర్మించారు. నానక్రాంగూడ వైపు నుంచి సర్వీసు రోడ్డులో వచ్చే వాహనాలు, మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలు నార్సింగి రోటరీ వద్ద కుడివైపు మళ్లిన తర్వాత కొంత దూరం వెళ్లి ఎడమ వైపు తిరిగి ఓఆర్ఆర్ పైకి వెళ్లే మార్గంలోకి చేరుకుంటాయి. కోకాపేట, గండిపేట వైపు నుంచి వచ్చే వాహనాలు నార్సింగి బ్రిడ్జి మీదుగా వచ్చి ప్రీ లెప్ట్ తీసుకొని ఓఆర్ఆర్ మీదకు వెళ్లేలా రోడ్డును నిర్మించారు.
అత్యంత కీలకంగా.. నార్సింగి ఇంటర్చేంజ్
ఇప్పటి వరకు శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు వాహనాలు ఓఆర్ఆర్పైకి ఎక్కేందుకు, దిగేందుకు తెలంగాణ పోలీస్ అకాడమి, నానక్రాంగూడ, కోకాపేట ఫైనాన్సియల్ డిస్ట్రిక్ వద్ద మాత్రమే ఇంటర్చేంజ్లు ఉండేవి. నార్సింగి జంక్షన్ ఇంటర్చేంజ్ అందుబాటులోకి వస్తే ఆయా టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గనున్నది. నార్సింగి, కోకాపేట, పుప్పాల్గూడ, మంచిరేవుల ప్రాంతాల్లో ఐటీ కంపెనీల కార్యాలయాలతో పాటు నివాస ప్రాంతాలు, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్లు, విల్లాలు, ఇతర నివాసాలు ఎక్కువగా ఏర్పాటవుతుండటంతో నార్సింగి ఇంటర్చేంజ్ కీలకంగా మారనున్నది. భవిష్యత్తులోను ఈ ప్రాంతంలో మరిన్ని నివాసాలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ గణనీయంగా పెరుగనున్నది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న హెచ్ఎండీఏ నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది.