బంజారాహిల్స్/ హిమాయత్నగర్ ఏప్రిల్ 9: శ్రీరామనవమి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై శనివారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో సమావేశం నిర్వహించారు. సెక్టార్ ఎస్సైలు, పెట్రోకార్ సిబ్బంది, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి బందోబస్తుకు సంబంధించిన సూచనలు అందజేశారు. శోభాయాత్రలు జరిగే దారిలో అసాంఘికశక్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు.
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి…
శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నారాయణగూడ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు తెలిపారు. శోభాయాత్రపై నిఘా పెట్టి శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందితో శనివారం సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాల కు అతీతంగా ప్రతి ఉత్సవం శాంతి యుతంగా జరగాలన్నదే తమ ఉద్దేశమని, శోభాయాత్ర వెళ్లే ప్రాంతాల్లో పోలీసులతో పాటు మైత్రీ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ సిబ్బందితో పాటు సీసీ కెమెరాలు, సెల్ఫోన్లలో ర్యాలీని చిత్రీకరించి, ర్యాలీలో అలజడి సృష్టించడానికి ప్రయత్నించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏడు ప్రాంతాల్లో కల్యాణ వేడుకలు జరుగుతున్నాయని, ర్యాలీ కొనసాగే ప్రాంతంలో ఉన్న ప్రార్థన మందిరాలకు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశామన్నారు.