ఎల్బీనగర్, జనవరి 18: ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను తీసుకురావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేట న్యూ మారుతీనగర్ చౌరస్తా నుంచి కొత్తపేట మహిళా మండలి భవనం వరకు రూ.3లక్షల వ్యయంతో మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్గౌడ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించి తన శాసనసభ నిధుల నుంచి రూ.5కోట్లు, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్తా నిధులు ఒక్కో కోటి చొప్పున మొత్తం రూ.ఏడు కోట్లు సీసీ కెమెరాల కోసం కేటాయించామన్నారు. మాజీ కార్పొరేటర్, కొత్తపేట శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ వజీర్ ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు తనవంతుగా సేవ చేసేందుకే సొంత నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, చైతన్యపురి సీఐ రవికుమార్, టీఆర్ఎస్ యువజన నాయకులు బొగ్గారపు శరత్చంద్ర, వరుణ్చంద్ర, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేతారెడ్డి, శరణ్, షరీన్, అశోక్ జైన్, బాబు, బాలు తదితరులు పాల్గొన్నారు.