సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటూ, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంబడించి పట్టుకోవాలని, జరిగిన నేరాలను త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలు ధైర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం డీసీపీ స్థాయి అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులను పట్టుకోవడంతో పాటు నేర పరిశోధనలో సాంకేతికతను ఉపయోగించుకోవాలని, సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని సూచించారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు. రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అలాంటి వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం చాలా వరకు తగ్గిందని సీపీ గుర్తు చేశారు. నేర దర్యాప్తులో సివిల్, ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా, ఆయా వాహనాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా పోలీస్స్టేషన్లు, విభాగాలలో పనిచేస్తూ పనిలో ప్రతిభ కనబరిచే వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ సత్యనారాయణ, డీసీపీలు జానకి, రాజేశ్ చంద్ర, సాయి శ్రీ, గిరిధర్, మురళీధర్, మధుకర్ స్వామి, శ్రీ బాల, ఇందిరా, అదనపు డీసీపీ నర్మద, షమీర్, తదితరులు పాల్గొన్నారు.