Hyderabad | అడ్డగుట్ట, మార్చి 02 : నాలుగు నెలలుగా వ్యాపారాలు లేక ఆర్థిక భారాన్ని మోస్తున్నాం.. అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాము.. కనీసం ముస్లింల పవిత్ర పండుగైనా రంజాన్ మాసంలోనైనా మమ్మల్ని వీధి వ్యాపారాలు నిర్వహించుకోనివ్వండని లాలాగూడ స్ట్రీట్ వెండర్స్ చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు.
రంజాన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో ఆదివారం లాలాగూడ న్యూ బ్రిడ్జి వద్ద స్ట్రీట్ వెండర్స్ పండ్ల వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చిలకలగూడ ట్రాఫిక్, ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న బండ్లను తొలగించడం జరిగింది. దీంతో స్ట్రీట్ వెండర్స్ తమకు రంజాన్ నెలలోనైనా వ్యాపారాలను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ట్రాఫిక్ పోలీసులను కోరడం జరిగింది. అయినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా బండ్లను పూర్తిగా తొలగించారు. దీంతో తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
సుమారుగా 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో వ్యాపారాలను నిర్వహించుకుంటున్నామని, 100 కుటుంబాల వరకు ఈ వ్యాపారాలపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాయని వారు తెలిపారు. ఉన్నట్టుండి పోలీసులు కొత్త విధానాలతో తమకు వ్యాపారాలు నిర్వహించకుండా ఆటంకాలు ప్రశ్నించడం ఏమాత్రం సబబు కాదని వారు సందర్భంగా తెలియజేశారు. రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని వీధి వ్యాపారులందరూ సుమారు రూ. 20 లక్షల వరకు పండ్లను కొనుగోలు చేసి తీసుకొచ్చామని, వ్యాపారాలు నిర్వహించుకోకుంటే తమకు మనుగడ కష్టమవుతుందని వారి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఫుట్పాత్పై వ్యాపారాలు నిర్వహించుకుంటున్న లాలాగూడలో మాత్రం పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఉన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలు నిర్వహించుకునేలా సహకరించాలని వారు కోరారు.
పోలీసులు మా కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలి
వీధి వ్యాపారమే జీవనోపాధిగా తాము 20 సంవత్సరాలుగా కుటుంబాలను పోషిస్తున్నాము. ఇప్పుడు ఉన్నట్టుండి తమకు కొత్త నిబంధనలతో వ్యాపారాలను నిర్వహించుకోకుండా చేయడం సరికాదు. కుటుంబ పోషణ కష్టమై ఇప్పటికే చాలావరకు అప్పులు చేయడం జరిగింది. ఇకనైనా చిలకల గూడ ట్రాఫిక్ పోలీసులు తమ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యాపారాలను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాము.
మహమ్మద్ నిజాముద్దీన్, లాలాగూడ స్ట్రీట్ వెండర్