మియాపూర్, ఏప్రిల్ 8: చందానగర్ సర్కిల్ మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్లో ముగ్గురు చిన్నారులపై వీధికుక్కలు దాడిచేసి గాయపర్చిన సంఘటన మియాపూర్లో చోటుచేసుకున్నది. ఏంఏ నగర్కు చెందిన చిన్నారులు సిద్ధ రామేశ్వర్(11), మోక్షిత్(7) శుక్రవారం రాత్రి తమ ఇంటికి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్తుండగా ఒక్క సారిగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. పరుగులు తీయబోయి కిందపడ్డారు. ఈ క్రమంలో వీధికుక్కలు ఇరువురిపై దాడి చేయగా గాయాలయ్యాయి.
ఇదే కాలనీకి చెందిన చందు (6) అనే మరో చిన్నారి కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతడిపై స్థానికంగా ఉన్న వీధి కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు వెంటనే చిన్నారులకు వైద్య చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కాలనీలో వీధి శునకాలు సంచరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని, ప్రధానంగా రాత్రి వేళల్లో దాడికి పాల్పడుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.