మాదాపూర్, జనవరి 13: పటేల్ చెరువు వద్ద నూతనంగా చేపడుతున్న ఎస్టీపీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద రూ.26.27 కోట్ల వ్యయంతో 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపడుతున్న ఎస్టీపీ నిర్మాణ పనులను శుక్రవారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో పాటు జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్టీపీ నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని అన్నారు. తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధికరణలో మైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తున్నదని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందని, ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 772 ఎంల్డీ సీవరేజ్ ప్లాంట్లకు అదనంగా 1260 ఎంఎల్డీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతిని ఇచినట్లు చెప్పారు.
31 ప్రాంతాల్లో సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రూ.9866.21 కోట్లను కేబినెట్ కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్టీపీల నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి పనులలో రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 31 మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో 7 ఎస్టీపీలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మియాపూర్ పటేల్ చెరువు 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో 26.27 కోట్ల వ్యయంతో ఎస్టీపీ నిర్మాణ ఏర్పాటు, గంగారం పెద్ద చెరువు వద్ద రూ. 64.14 కోట్ల వ్యయంతో 20.0 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మాణం, దుర్గం చెరువు వద్ద రూ.25.67 కోట్ల అందచనా వ్యయంతో 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మాణం, ఖాజాగూడ చెరువు వద్ద రూ.61.25 కోట్ల అంచనా వ్యయంతో 21.0 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మాణం, అంబీర్ చెరువు వద్ద రూ.100.87 కోట్ల అంచనా వ్యయంతో 37.0 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మాణం, ఎల్లమ్మకుంట చెరువు జయనగర్ వద్ద రూ.43.46 కోట్ల వ్యయంతో 13.50 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మాణం, పరికి చెరువు వద్ద రూ. 83.05 కోట్ల అంచనా వ్యయంతో 28.0 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మాణ పనులకు నిధులను మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే వీటిని ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చర్యలు తీసుకోనున్నట్లు విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులు డీజీఎం శ్రీనివాస్ రాజు, మేనేజర్ శంకర్, మెగా ప్రాజెక్ట్స్ ఇంజినీర్ వెంకట్ రామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీ ఇబ్రహీం, మహ్మద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.