సిటీబ్యూరో: లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అధికారులకు సూచించారు. శుక్రవారం కమిషనరేట్లో రెవెన్యూ, అబ్కారీ, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ తదితర శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో సీపీ మాట్లాడారు. ఓటర్లను ప్రభావితం చేసే క్రమంలో అక్రమ డబ్బు పంపిణీ, రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయని, దీనిని అరికట్టేందుకు పోలీసులతో పాటు ఐటీ, జీఎస్టీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను వివరించారు. ఈ సారి ఉద్యోగులకు సంబంధించిన ఎపిక్ వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడమే కాకుండా వారికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు 10రోజుల సమయాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్(ట్రాఫిక్) జోయల్ డెవీస్, మాదాపూర్ డీసీపీ డా.వినీత్ తదితరులు పాల్గొన్నారు.
ఇష్టంలేని వారిపై బలవంతంగా హోలీ రంగులు చల్లితే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి హెచ్చరించారు. కాగా, హోలీ పండుగ నేపథ్యంలో ట్రై కమిషనరేట్ల పరిధిలో ఈనెల 25 ఉదయం 6గంటల నుంచి 26 ఉదయం 6గంటల వరకు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లను మూసివేస్తున్నట్లు ట్రై పోలీసు కమిషనర్లు వెల్లడించారు. 25న కబేళాలు, మాంసం దుకాణాలు, బీఫ్ దుకాణాలను మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.