ఎల్బీనగర్, డిసెంబర్ 23 : పోలీసుల చొరవతో, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సహకారంతో కోదండరాంనగర్లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి గురైన నగలు తిరిగి ఆలయ కమిటీకి చేరుకున్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బిచినేపల్లి వెంటేశ్వర్రావు, గంధం వెంకటేశ్వర్లు, జక్కంపుడి నారాయణ మూర్తి, పాల్తీ శ్రీనివాస్ గుప్త, రామేశ్వర్, రామకృష్ణయ్య, వరదాచార్యులు మాట్లాడుతూ.. గత నెల 24న గుర్తు తెలియని దొంగ దేవాలయంలోకి ప్రవేశించి స్వామి వారి 12 తులాల బంగారు అభరణం, అరకిలో వెండి ఆభరణాలను దొంగిలించి పారిపోయాడు. ఈ విషయాన్ని ఉదయాన్నే గమనించిన పూజారి సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తక్షణం స్పందించాలని పోలీసులకు సూచించారన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా గంటల వ్యవధిలోనే దొంగను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. దొంగ నుంచి చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నప్పటికీ కోర్టు నుంచి నగలు గురువారం దేవాలయ కమిటీకి అప్పగించారని తెలిపారు. దేవాలయంలో చోరీ జరిగిన వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న పోలీసులకు, సహకరించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.