ఎమ్మెల్యే ముఠా గోపాల్
డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడి
ముషీరాబాద్/చిక్కడపల్లి, ఏప్రిల్ 9 : ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేసి స్టీలు వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి స్టీలు వంతెన నిర్మాణం పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. శనివారం ఆయన వీఎస్టీ-ఇందిరాపార్కు మార్గంలో చేపడుతున్న స్టీలు వంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్నగర్, ఇందిరాపార్కు, వీఎస్టీ చౌరస్తాలలో చేపడుతున్న పనుల తీరు పరిశీలించిన ఎమ్మెల్యే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనతరం ఆయన మాట్లాడుతూ భూమిలో కేబుల్ వైర్లు, డ్రైనేజీ పైపులైన్లు ఉండడం కారణంగా పిల్లర్ల ఏర్పాటు పను లు నెమ్మదిగా జరిగాయని అయినప్పటికీ నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈఈ గోపాల్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముఠా నరేశ్, శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్, బి.శ్రీనివాస్రెడ్డి, శ్యామ్సుందర్, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.