గ్రేటర్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్పై మోజు
అంతకంతకూ పెరుగుతున్న సంఖ్య
2016లో 25.. నాలుగేండ్లలో 4535
ఇప్పటివరకు 10,700 వాహనాల రిజిస్ట్రేషన్
కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్న సర్కార్
వందశాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ మినహాయింపు
పెట్రోమంటతో ఈవీల వైపు నగరవాసుల చూపు
భారీగా తగ్గనున్న పర్యావరణ కాలుష్యం
గంట చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు..40 నుంచి 50 కి.మీ వేగం. అతితక్కువ వ్యయంతో ప్రయాణం.. ఇవన్నీ కరెంటు వాహనాల ప్రత్యేకత. రోజురోజుకూ మండిపోతున్న ఇంధన ధరలు, నిర్వహణ వ్యయం పెరుగుతుండడంతో నగరవాసుల చూపు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) వైపు మళ్లుతున్నది. అన్నింటికీ మించి కాలుష్య రహిత వాహనాలు కావడంతో వీటి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. 2016లో గ్రేటర్వ్యాప్తంగా 25 బ్యాటరీ వాహనాలుంటే..నాలుగేండ్లలో 4535 చేరాయంటే ఆసక్తి ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నది. వీటితోపాటు పెట్రోల్, డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలు కలిపి ఇప్పటివరకు 10,700 రిజిస్ట్రేషన్ అయ్యాయి. కాలుష్యాన్ని భారీగా తగ్గించి పర్యావరణానికి మేలు చేసే కరెంటు వాహనాల వినియోగం పెంచేందుకు రాష్ట్ర సర్కారు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీని అమల్లోకి తెచ్చింది. పదేండ్లలో పూర్తిగా ఈవీ మయం చేసే లక్ష్యంతో వందశాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా అన్నిరకాల వాహనాలు కలిపి 65 లక్షలపైనే ఉన్నట్లు అంచనా.
హైదరాబాద్ : పెరిగిన ఇంధన ధరలతో ప్రస్తుతం వాహనాలు నడుపాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరవాసుల చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపునకు మళ్లుతున్నది. వ్యయం తక్కువ..కాలుష్యరహితం కావడంతో ఈ వెహికిల్స్పై మక్కువ పెంచుకుంటున్నారు. దీనికి సర్కారు ప్రోత్సాహం కూడా తోడవ్వడంతో కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మరికొందరు తమ వాహనాలను ‘ఈవీ’గా మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం బ్యాటరీ ఆపరేటెడ్ 4,535, హైబ్రిడ్ డీజిల్ ఎలక్ట్రిక్ 4,387, హైబ్రిడ్ పెట్రోల్ ఎలక్ట్రిక్ వాహనాలు 1778 ఉన్నాయి.
10,700 రిజిస్ట్రేషన్..
ఈవీ వెహికల్స్ కొనుగోళ్లకు సర్కారు ప్రోత్సాహం అందిస్తున్నది. ఈవీ పాలసీని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ కొనుగోలు చేసే వారికి అనేక రకాల రాయితీలు కల్పిస్తున్నది. ఫలితంగా సిటీలో విద్యుత్ వాహనాల జోరు కొనసాగుతున్నది. గ్రేటర్లో ఇప్పటి వరకు 10,700 ఈవీ వెహికిల్స్ రిజిస్ట్రేషన్ అవ్వగా, వీటి సంఖ్య మరింత పెంచేందుకు ఆర్టీఏ అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తున్నారు.
వందశాతం..
తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030 వరకు పూర్తిగా ఈవీ మయంగా మార్చడమే లక్ష్యంగా సర్కారు అడుగులు వేస్తున్నది. మొదటి రెండు లక్షల ద్విచక్ర వాహనాల కొనుగోలుకు వంద శాతం రోడ్డు ట్యాక్సీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చింది.
నాలుగేండ్లలోనే…
2016లో 25 బ్యాటరీ వాహనాలు ఉండగా, నాలుగేండ్లలో 4,535 అయ్యాయి. చాలా వరకు ఉన్న ఈవీ వాహనాల్లో ద్విచక్రవాహనాలే అధికంగా వినియోగంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు సిటీలో టీఎస్ఆర్టీసీ సైతం 40 ఎలక్ట్రిక్ వాహనాలను ఆపరేట్ చేస్తున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహంతో
ఈవీకి ఆదరణ
గ్రేటర్లో ఈవీ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఈవీ పాలసీతో అనేక రకాల రాయితీలు కల్పించడంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ -రైడ్ ద్వారా ట్రాలీ వెహికల్స్ను తీసుకొచ్చాం. ముఖ్యంగా సామాన్యులు తమ వ్యాపారం చేసుకునేలా వాహనాలను డిజైన్ చేశాం. చాలా మంచి ఆదరణ వస్తున్నది. – ఏ. దేవేందర్రెడ్డి, ఫౌండర్, ఈరైడ్