13 పాఠశాలలకు విడుదలైన రూ.2 కోట్ల 87 లక్షలు
విద్యార్థులకు ఆటంకం కలుగకుండా పనులు
జూబ్లీహిల్స్, జూన్16 : ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రానుంది. పాఠశాలల్లో తాగునీటి వసతి, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాతో పాటు తరగతి గదులలో బెంచీలు, టేబుల్స్, ఫ్యాన్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్ది.. భవనాలకు రంగులు వేసి ముస్తాబుచేయనున్నారు.. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు అందజేసి.. విరివిగా మొక్కలు పెంచి.. పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నారు.
ఇందుకుగానూ విద్యాశాఖ అధికారులు తొలి విడత 13 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి సన్నద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల్లో ఆధునీకర పనులు చేపట్టనున్నారు. పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రూ.2 కోట్లు కేటాయించిన నేపథ్యంలో అదనపు నిధులను ప్రభుత్వం అందించనుంది.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పనులు
ఖైరతాబాద్-2 మండలంలో నిర్ధేశించిన పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తున్నాం. అభివృద్ధ్ది నిధులలో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన్ట పనులకు టెండర్ ప్రక్రియ అవసరమైనందున కొన్ని పాఠశాలల్లో పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయి. మిగతా పాఠశాలల్లో మేనేజ్మెంట్ కమిటీలతో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరగతులకు ఆటంకం కలుగకుండా పనులు చేపడుతున్నాము.
– ఎస్.చిరంజీవి, డిప్యూటీ డీఈఓ, ఖైరతాబాద్