ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 21: విస్తారమైన ఇండియన్ – పసిఫిక్ మహా సముద్ర తీర దేశాల మధ్య సత్సంబంధాలపై విస్తృత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రస్తుత సమాజంలో సేల్స్మెన్ నుంచి అంబాసిడర్ వరకు అంతర్జాతీయ వ్యవహారాలపై కనీస అవగాహన తప్పనిసరిగా మారిందని అభిప్రాయపడ్డారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి సామాజిక, ఆర్థిక, సమకాలిన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కేంద్రం ప్రారంభోత్సవాన్ని ఓయూలోని పీజీఆర్ఆర్సీడీఈ సెంటెనరీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినోద్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండో పసిఫిక్ తీర ప్రాంత దేశాలతో సత్సంబంధాలు, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక మైత్రి అవసరమని, అప్పుడే అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించవచ్చని అభిప్రాయపడ్డారు. త్వరలోనే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ వ్యూహాత్మక కేంద్రంగా మారనున్నదని, తూర్పు, పశ్చిమ దేశాలకు మధ్య వారధి అవుతుందని వివరించారు.
లోతైన, నాణ్యమైన పరిశోధనల ద్వారా ఇండో పసిఫిక్ సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని చెప్పారు. ఢిల్లీలోని జేఎన్యూ తరువాత ఇండో పసిఫిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రెండో యూనివర్సిటీగా ఓయూ నిలిచిందని ప్రశంసించారు. ఇప్పుడిప్పుడే ఓయూ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. నూతన అధ్యయన కేంద్రాలు ప్రపంచ స్థాయి గుర్తింపును తెస్తాయనడంలో సందేహం లేద కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఓఎస్డీ, ఐఎఫ్ఎస్ అధికారి రాజశేఖర్ అన్నారు. ఈ కేంద్రానికి తగిన తోడ్పాటును అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ ఆసియా – పసిఫిక్ దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇండో పసిఫిక్ అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జేఎల్ఎన్ రావు, ఓయూ పీఆర్వో ప్రొఫెసర్ ప్యాట్రిక్, ప్రిన్సిపల్స్, ఆయా విభాగాల డైరెక్టర్లు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.