గురుకులాలకు దీటుగా స్కూల్ను తీర్చిదిద్దుతాం
త్వరలో జూనియర్ కాలేజీ ఏర్పాటు
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రులు కొప్పుల, సబిత
ఆర్కేపురం, జూన్ 16: గురుకులాలకు దీటుగా సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంను తీర్చిదిద్దుతామని షెడ్యుల్ కులాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలు హామీఇచ్చారు. గురువారం వీఎం హోం పాఠశాలలో రూ.3.58 కోట్లతో పాఠశాల భవన ఆధునీకరణ పనులు, రూ.57.05 లక్షలతో సోలార్గ్రిడ్ ఏర్పాటు, రూ.42.30 లక్షల వ్యయంతో ఆధునిక వ్యాయామశాల, క్రీడా ప్రాంగణం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, వీఎం హోంలో సమూలమైన మార్పులలు తీసుకొస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు లేని బాల,బాలికలకు ఆపన్నహస్తం ఇస్తున్న వీఎం హోంకు 120 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని, సువిశాలమైన స్థలం ఉండడం విద్యార్థుల అదృష్టమని, ఈ స్థలాన్ని కాపాడేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. అతి పురాతన భవనం, కట్టడాలను కాపాడుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పదోతరగతి అనంతరం విద్యార్థులు బయటకు వెళ్లకుండా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వీఎం హోంలో అన్ని సదుపాయాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామన్నారు. అనంతరం వీఎం హోంలో ఉత్తమ సేవలందిస్తున్న వైస్ ప్రిన్సిపాల్ శివప్రసాద్, హిందీ పండిట్ లలితాదేవి, ఇంగ్లీష్ టీచర్ మాధురిని మంత్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, కరస్పాండెంట్ లక్ష్మీపార్వతి, సరూర్నగర్ సర్కిల్ డీసీ హరికృష్ణయ్య, మాజీ కార్పొరేటర్ అనితాదయాకర్రెడ్డి, నియోజకవర్గ ప్రధానకార్యదర్శి బేర బాలకిషన్, అం కిరెడ్డి, పెండ్యాల నగేష్, అరవింద్శర్మ, బోయిని మహేందర్యాదవ్, రిషి, ప్రత్యూష్, సలీం పాల్గొన్నారు.