సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను బట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. ఈ సందర్భంగా సచివాలయం, గన్పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రూట్లలో నిర్ణీత కాలంలో రాకపోకలు సాగించకుండా, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లి సాఫీగా ప్రయాణాలు సాగించాలని అదనపు సీపీ సూచించారు.
అమరవీరుల స్తూపం వద్ద..
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రూట్లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేస్తామని అదనపు సీపీ తెలిపారు. పంజాగుట్ట నుంచి రాజ్భవన్ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్ మినార్, ఇక్బాల్ మినార్ నుంచి ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు, బీజేఆర్ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్ జంక్షన్, బషీర్బాగ్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తామన్నారు.