Stand With Her | హైదరాబాద్, జూన్ 14 : మహిళల భద్రత, గౌరవం, సమానత్వంపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న #StandWithHer ప్రచారంలో భాగంగా నాలుగో విడత ప్యానెల్ చర్చ శనివారం హైదరాబాద్లోని వీహబ్ (WeHub), డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగింది. “ప్రజా స్థలాలు అందరివే – పురుషుల ఉనికి, వారి ప్రవర్తన (ప్రజా ప్రదేశాల్లో లైంగిక వేధింపులు)” అనే అంశంపై ఈ చర్చ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి చారు సిన్హా, ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, ది హిందూ బిజినెస్ లైన్ రెసిడెంట్ ఎడిటర్ రిచా మిశ్రా, నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టు ఉమా సుధీర్ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత..
సమాజంలో మహిళలు ప్రజా ప్రదేశాల్లో ఎదుర్కొనే అసౌకర్యాలు, వేధింపులు, భయాందోళనలపై ఈ చర్చలో విస్తృతంగా చర్చించారు. మహిళలపై అసభ్యంగా చూడటం, ఈవ్ టీజింగ్, అనుచిత వ్యాఖ్యలు చేయడం, బెదిరింపులకు గురిచేయడం వంటి ప్రవర్తనలు వారి స్వేచ్ఛ, సంచార హక్కు, భద్రతా భావనలను దెబ్బతీస్తాయని ప్యానెల్ సభ్యులు పేర్కొన్నారు. ప్రజా స్థలాలు అందరికీ సమానంగా చెందుతాయని, వాటిని మహిళలకు సురక్షితంగా, ఆహ్వానకరంగా మార్చడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా చారు సిన్హా, ఐపీఎస్,మాట్లాడుతూ.. మహిళల భద్రత అనేది కేవలం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వ్యక్తి తన ప్రవర్తన ద్వారా మహిళలకు భద్రతా భావన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. “మీ ఉనికి ఒక ఎంపిక. మీ చుట్టూ ఉన్న మహిళలకు మీరు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి” అని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో అవకాశాలు కల్పించి, అవసరమైన సమయంలో అండగా నిలిచిన పురుషులకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినని తెలిపారు.
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా సంచరించగల వాతావరణం ఏర్పడాలంటే సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. మహిళలు సురక్షితంగా ఉన్నారనే నమ్మకాన్ని కలిగించే సామాజిక వాతావరణాన్ని నిర్మించడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునేలా..
నటుడు, రచయిత, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునేలా పురుషులు నమ్మకం కలిగించే వాతావరణాన్ని సృష్టించాలని సూచించారు. మహిళల మాటలను వినడం, అర్థం చేసుకోవడం, వారికి మద్దతుగా నిలవడం ఎంతో ముఖ్యమని అన్నారు.
రిచా మిశ్రా మాట్లాడుతూ, మహిళలకు అండగా నిలిచే పురుషుడు బలహీనుడు కాదని, నిజానికి అతడే మరింత బలమైన వ్యక్తి అని పేర్కొన్నారు. కుటుంబం, కార్యాలయం, సమాజం అనే తేడా లేకుండా మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించేందుకు పురుషులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
చర్చను నిర్వహించిన ఉమా సుధీర్ మాట్లాడుతూ, మహిళలపై వివక్ష, వేధింపులు, అన్యాయాల విషయంలో పురుషులు మౌనంగా ఉండకుండా స్పందించాలని కోరారు. మహిళల కోసం నిలబడటం, అన్యాయాన్ని ప్రశ్నించడం నిజమైన బాధ్యతాయుతమైన పురుషత్వానికి నిదర్శనమని అన్నారు.
#StandWithHer ప్రచారం ఏడాది పొడవునా కొనసాగనున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రతి నెలా ఒక ప్రత్యేక అంశంపై చర్చలు నిర్వహిస్తూ మహిళా-పురుషుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడం, లింగ సమానత్వంపై చైతన్యం కల్పించడం, సానుకూల సామాజిక మార్పును ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నెల నిర్వహించిన “ప్రజా స్థలాలు అందరివే” అనే చర్చలో మహిళల భద్రతకు కేవలం చట్టాలు, వ్యవస్థలు మాత్రమే కాకుండా వ్యక్తిగత బాధ్యత, పరస్పర గౌరవం, సామాజిక చైతన్యం కూడా కీలకమని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. మహిళలు భయరహితంగా, గౌరవప్రదంగా జీవించే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.