Sri Rama Navami | సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. హైదరాబాద్లోని సీతారాంబాగ్లో ప్రారంభమైన శోభాయాత్ర సుల్తాన్బజార్ వరకు సాగింది. ఈ ప్రధాన శోభాయాత్రకు నగరంలోని వివిధ ప్రాంతాల ర్యాలీలు వచ్చి కలిశాయి. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
సుల్తాన్బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు ఈ ర్యాలీ రాత్రికి చేరుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి క్షేత్ర స్థాయిలో జరిగే ర్యాలీలను కమిషనర్లు పరిశీలించారు. నగరంలో శోభాయాత్ర నేపథ్యంలో ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ర్యాలీ వస్తున్న సమయంలో ఆయా రూట్లలోని ట్రాఫిక్ను ఇతర మార్గాలకు మళ్లించారు.