ముస్తాబైన ఆలయాలు..
యాత్ర ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ చర్యలు
సీసీ కెమెరాల నిఘాలో యాత్ర
దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య
అబిడ్స్, ఏప్రిల్ 9: శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణం అనంతరం శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం యాత్ర ప్రాంతంలో యజ్ఞం అనంతరం ప్రారంభిస్తారు. సీతారాంబాగ్ నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధూల్పేట్ ఆకాశ్పురి హనుమాన్ దేవాలయం నుంచి గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్రను నిర్వహిస్తారు. టీఆర్ఎస్ నాయకులు ఆనంద్సింగ్ నేతృత్వంలో స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాలను చేపడుతారు. శోభాయాత్రను పురస్కరించుకుని దారి పొడవునా స్వాగత వేదికల ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. స్వాగత వేదికలు, యాత్రలో పాల్గొనే వారికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించడంతోపాటు యాత్రకు పూలతో స్వాగతం పలికేందుకు గాను పలువురు నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శోభాయాత్రకు భారీ పోలీస్ బలగాలతో బందోబస్తు, సీసీ కెమెరాలు, మొబైల్ కెమెరాల వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మెహదీపట్నం : లంగర్హౌస్ డివిజన్ బాపూఘాట్ సమీపంలో ఉన్న సంగం రామచంద్రజీ మఠంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ మఠాధిపతి రాహుల్దాస్ బాబా తెలిపారు.
చార్మినార్ : శ్రీరామ నవమికి గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య తెలిపారు. శనివారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. పాతనగరంలోని ఛత్రినాక, మొఘల్పుర, చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిల్లో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భక్తులు ర్యాలీలు చేపట్టనున్నారని తెలిపారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. స్థానిక పోలీసులు, 3 ఫ్లాటూన్ల ఆర్ఏఎఫ్ బలగాలతోపాటు టాస్క్ఫోర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళం బందోబస్తులో పాలుపంచుకోనున్నారని డీసీపీ తెలిపారు. ర్యాలీ మార్గం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగనుందని తెలిపారు.
జియాగూడ : కార్వాన్ నియోజకవర్గంలోని సీతారాముల ఆలయాలు, శ్రీరామచంద్రస్వామి కల్యాణోత్సవానికి జియాగూడ డివిజన్ పరిధిలోని సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమంలో కొలువుదీరిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, శ్రీ రంగనాథస్వామి దేవాలయం, శ్రీ మహంకాళీ స్ట్రీట్ మహంకాళీ ఆలయం, వందఫీట్ల బైపాస్ రోడ్డులోని హనుమాన్ దేవాలయం, ఆరెకటిక భవనం తదితర ప్రాంతాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నారాయణ ఆశ్రమం పీఠాధితి ప్రభుదత్త మహారాజ్ తెలిపారు.