సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కొత్తకొత్త రుచులను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ‘హబ్ ఆఫ్ గుడ్ ఫుడ్’గా వెలుగులీనుతున్నది. హైదరాబాద్ అంటే బిర్యానీయే గుర్తుకు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా నగరానికి బిర్యానీ ఫేమస్గా ఉంది. ఇలా విభిన్న రకాల బిర్యానీలు, హలీంలు, స్ట్రీట్ స్నాక్స్ వరకు అనేక వెరైటీలతో హైదరాబాద్.. ఫుడ్ లవర్స్ మనసు దోచుకున్నది. అనేక అవార్డులను సొంతం చేసుకున్నది. మొన్నటి వరకు గోల్డ్ దోశ, గోల్డ్ గులాబ్ జామ్తో పాటు తాజాగా గోల్డ్ ఇడ్లీని అందిస్తున్నది. బంజారాహిల్స్లోని కృష్ణ ఇడ్లీ కేఫ్లో రూ.1200లకు ప్లేట్ (రెండు పీస్లు), కింగ్ కోఠి, సికింద్రాబాద్లోని బ్రాంచీల్లోనూ గోల్డ్ టిఫిన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు బంజారాహిల్స్లో మరో హోటల్ సరికొత్త రుచులను ప్రారంభించింది. సత్వం అనే రెస్టారెంట్ 4 వందలకు పైగా రుచులతో ఫుడ్ లవర్స్ను ఆకట్టుకుంటున్నది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందించే ఆహార రుచులను తీసుకొచ్చింది. బెంగళూరు ఇస్కాన్లో చెఫ్గా విధులు నిర్వర్తించిన ఆదిత్య ఫతేహ్పురియ.. సత్వంను ఏర్పాటు చేశారు. శరీరంలోని ఒక్కో అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారంపై అధ్యయనం చేసిన ఆయన.. అటువంటి ఫుడ్ మెనూను పరిచయం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన ఈ సత్వంకు ఫుడ్ లవర్స్ అమితంగా ఆసక్తి చూపిస్తున్నారు. మునులు, రుషులు ఎటువంటి ఆహారం తీసుకునే వారో అటువంటి పోషకాలున్న ఆహారాన్ని అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సాత్విక్ పన్నీర్ టిక్క, భార్బన్ ఆలూ, బీట్రూట్ సీఖ్, కేసర్ తుల్సీ సింకంజి తదితర వాటిని అందిస్తున్నారు.
Hyd9
అన్ని సంస్కృతుల ఆహారాన్ని అక్కున చేర్చుకుంటారు
అనేక రుచులకు కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ నిలిచింది. ఎటువంటి సరికొత్త రుచులనైనా ఆదరించే ప్రజలు ఇక్కడ ఉంటారు. అన్ని సంస్కృతుల ఆహారాలను అక్కున చేర్చుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని అందించే ఫుడ్కు ఇటీవల విశేష ఆదరణ లభిస్తున్నది. మేం ఆ తరహాలోనే ఓ ప్రయత్నం చేశాం. సత్వం రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం వెనక ఆరోగ్యమే లక్ష్యం. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎటువంటి జాగ్రత్తలతో ఆహారం తయారు చేస్తామో అంతే శ్రద్ధతో ఆరోగ్యంగా పోషక విలువలతో ఫుడ్ను అందిస్తాం. ఆ ఆహారాన్ని ఆరగించే సమయంలోనే కస్టమర్లు దైవ సన్నిధి అనుభూతి పొందుతారని విశ్వసిస్తున్నాం.
– ఆదిత్య ఫతేహ్పురియ