సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో వరుస స్నాచింగ్లకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు హైదరాబాద్, రాచకొండ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. స్నాచింగ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు గుర్తించారు. పాత నేరస్తులైన జింజానాకు చెందిన పింట్, మంగళ్సింగ్ ముఠాతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. శనివారం వేర్వేరు ప్రాంతాల్లో వరుస స్నాచింగ్లకు పాల్పడి.. పరారయ్యే క్రమంలో నిందితులు సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఆటోలను మారుస్తూ తిరిగినట్టు గుర్తించారు. ఎంజీబీఎస్ నుంచి నాంపల్లికి వెళ్లారు. నాంపల్లి వద్ద నిందితులకు సంబంధించిన సీసీ కెమెరా లింక్లు తెగిపోయాయి. దీంతో నిందితులు పక్కా ప్లాన్తోనే చైన్ స్నాచింగ్లకు పాల్పడటంతో పాటు సీసీ కెమెరాలకు చిక్కకుండా తప్పించుకున్నారని పోలీసులు గుర్తించారు. నేరగాళ్లు ఎక్కడికి వెళ్లారు.. ఎలా వెళ్లారు.. అనే విషయంపై నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు.
నగరంలో 2016, 2018లో జరిగిన చైన్ స్నాచింగ్ నేరాల్లో ఉత్తర్ప్రదేశ్లోని శామిలీ జిల్లా జింజాన పోలీస్స్టేషన్ పరిధికి చెందిన రెండు ముఠాలు పట్టుబడ్డాయి. ఈ ముఠాల్లోని కొంతమంది జైళ్లలో ఉండగా.. మరికొంతమంది బయట ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శనివారం నగరంలో చైన్ స్నాచింగ్లు జరిగిన ప్రాంతాల్లోని మొత్తం సీసీ కెమెరాలను జంట కమిషనరేట్ పోలీసులు జల్లెడ పట్టారు. సీసీ కెమెరాల్లో నిందితులను గుర్తించిన పోలీసులు.. ఉత్తర్ప్రదేశ్లోని శామిలీ జింజానా గ్యాంగ్గా నిర్ధారించారు. ఈ గ్యాంగ్ సభ్యుల కోసం ఆరా తీస్తున్నారు.
నగరాలే టార్గెట్..
ఈ గ్యాంగ్ సభ్యులు జైళ్ల నుంచి బయటకు రాగానే విమానాలు, రైళ్లలో ఒక నగరానికి వెళ్లి అక్కడ వరుసగా స్నాచింగ్లకు పాల్పడుతారు. అక్కడి నుంచి మరో నగరానికి మారుతుంటారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే బెంగళూర్లో కూడా శుక్రవారం 10 స్నాచింగ్లకు పాల్పడిన ఈ ముఠా, హైదరాబాద్ను టార్గెట్ చేసుకొని శనివారం వరుస స్నాచింగ్లకు పాల్పడింది. నిందితుల కోసం తెలంగాణతో పాటు కర్ణాటక పోలీసులు కూడా గాలిస్తున్నారు.
చార్మినార్ టు ఉప్పల్..!
శనివారం ఉదయం చార్మినార్ ప్రాంతంలో ఒక బైక్ను దొంగిలించిన స్నాచర్లు.. దానిని అబిడ్స్లో వదిలేసి అక్కడ పల్సర్ వాహనాన్ని దొంగిలించారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, చిలకలగూడ, రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ల పరిధిలో వరుసగా ఏడు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. సికింద్రాబాద్ ప్యారడేజ్ పరిసరాల్లో దొంగిలించిన బైక్ను వదిలేసి.. అక్కడి నుంచి కాచిగూడకు ఆటోలో వెళ్లారు. అక్కడ మరో ఆటో తీసుకొని నాంపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎంజీబీఎస్కు మరో ఆటోలో వెళ్లారు. దొంగిలించిన బైక్పై తిరుగుతూ.. ముఖాలకు మాస్క్లు ధరించి నేరాలు చేశారు. పోలీసులకు చిక్కకుండా నేరాలకు ఉపయోగించిన వాహనాలను కూడా ఇక్కడే విడిచివెళ్లారు. శనివారం జరిగిన వరుస స్నాచింగ్ ఘటనలతో అప్రమత్తమైన జంట కమిషనరేట్ల పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
యూపీకి పోలీసు టీమ్..
స్నాచర్లను గుర్తించిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేక బృందం ఉత్తర్ప్రదేశ్కు వెళ్లింది. అదే విధంగా.. వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా ఇప్పటికే వేర్వేరు రాష్ర్టాల్లో ఉన్న హైదరాబాద్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఢిల్లీ, యూపీ, హర్యానా పోలీసులను కూడా అప్రమత్తం చేసిన హైదరాబాద్ పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు అక్కడి పోలీసుల సహాయం కోరారు. ప్రస్తుతం నిందితులకు సంబంధించిన పక్కా సమాచారం చేతికి చిక్కడంతో అన్ని మార్గాలపై నిఘా పెట్టిన పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.