బంజారాహిల్స్,డిసెంబర్ 26: జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ‘ప్రజా పాలన’ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు జీహెచ్ఎంసీ సర్కిల్-18లో చేపట్టనున్న ‘ప్రజా పాలన’ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ జోనల్ కమిషనర్ వెంకటేష్ ధోత్రేతో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ. జలమండలి, రెవెన్యూ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా బస్తీలు, లోకాలిటీల వారీగా అధికారులు పర్యటించడంతో పాటు సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
సర్కిల్ పరిధిలో 16 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, సర్కిల్కు ప్రత్యేక అధికారిగా దయానంద్ను నియమించామని పేర్కొన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో కేంద్రంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది మంది సిబ్బందితో పాటు నోడల్ అధికారి దరఖాస్తుల స్వీకరణ పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం నోడల్ అధికారిని నియమించారు. వివిధ పథకాలకోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్తో పాటు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాట్లు చేయనున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేస్తూ దరఖాస్తుల స్వీకరణ నిర్వహించాల్సి ఉంటుంది.