బాలానగర్ /జీడిమెట్ల/గాజులరామారం, మే 10: శాంతి భద్రతలకు భంగం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి, ఆయా పీఎస్లలో పని చేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అమాయకులే కాకుండా విద్యావంతులు కూడా సైబర్మోసాల బారిన పడుతుండడం విచారకరమని అన్నారు. గంజాయి క్రయ విక్రయాలపై సమాచారం అందిన వెంటనే చర్యలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సందీప్ గోనే, ఏసీపీ పురుషోత్తం యాదవ్, సీఐలు ఎండీ వహీదుద్దీన్, కె.బాలరాజు, సైదులు, డీఐ ఎంఆర్ గంగారామ్, ఎస్ఐలు హరీశ్, శరత్ కుమార్, మక్బూల్ పాల్గొన్నారు.
పాత నేరస్థులకు సీపీ కౌన్సెలింగ్
పాత నేర చరిత్ర కలిగిన వారికి మంగళవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కౌన్సెలింగ్ ఇచ్చారు. పాత నేరస్థులు ఎవరైనా తిరిగి సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడితే బైండోవర్ కేసులను నమోదు చేయాలని సీపీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, ఏడీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీలు రవిచంద్ర, శ్యామ్బాబు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఫారెస్టు ఆఫీసర్.. ఓటీపీలు చెప్పేశాడు
ఖాతా నుంచి 3.29 లక్షలు మాయం.
సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ) : గుర్తు తెలియని వ్యక్తి పంపిన మెసేజ్కు స్పందించి ఓ అటవీ శాఖ ఉన్నతాధికారి ఓటీపీలు చెప్పడంతో ఖాతా నుంచి లక్షలాది రుపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఫిర్యాదులో నమోదైన వివరాల ప్రకారం..మాదాపూర్ విఠల్రావునగర్ ప్రాంతానికి చెందిన అటవీ శాఖ అధికారి ఫోన్కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో మీ ఖాతాకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతున్నాయి. మీ సేవలకు ఆటంకం కలుగకుండా ఉండాలంటే ఈ లింక్ను క్లిక్ చేయమని వివరించారు. అటవీశాఖ అధికారి ఆ లింక్ను క్లిక్ చేసి అందులో పాన్ కార్డు, పుట్టిన తేది వంటి వివరాలు నమోదు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఓటీపీలను కూడా మెసేజ్ రూపంలో పంపించడంతో సైబర్ నేరగాళ్లు నాలుగు సార్లు ఫారెస్టు ఆఫీసర్ ఖాతా నుంచి రూ. 3.29 లక్షలు కొట్టేశారు. నగదు బదిలీకి సంబంధించిన సమాచారం రావడంతో కంగుతిన్న అధికారి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎల్ఈడీ టీవీల అమ్మకం పేరుతో..
బంజారాహిల్స్, మే 10: ఎల్ఈడీ టీవీలు కొనేందుకు ఆన్లైన్లో ప్రయత్నించగా డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 8లోని ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న జీఎస్.కోమలత ఆఫీసు కోసం ఎల్ఈడీ టీవీలు కొనాలని భావించారు. ఆన్లైన్లో ఇండియన్ మార్ట్ అనే సైట్లో హోల్సేల్ డీలర్ల కోసం వెదికారు. కాసేపటికి రోహిత్ శర్మ అనే యువకుడు ఆమెకు ఫోన్ చేసి తాము హోల్సేల్ ఎల్ఈడీ టీవీ డీలర్లమని నమ్మబలికాడు. ఎల్ఈడీ టీవీలు డోర్ డెలివరీ చేస్తామని సంస్థకు చెందిన ఇన్వాయిస్లు, జీఎస్టీ నెంబర్, బ్యాంకు ఖాతానెంబర్ పంపించాడు. అతడి మాటలు నమ్మిన కోమలత రూ.68 వేలు పంపించింది. మిగిలిన మొత్తాన్ని టీవీలు డెలివరీ అయ్యాక పంపిస్తానని చెప్పింది. అయితే మిగిలిన డబ్బు వేస్తేనే టీవీలు పంపిస్తామని రోహిత్ శర్మ చెప్పడంతో పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాటల్లో పెట్టి.. ఖాతా కొల్లగొట్టి..
నేరేడ్మెట్ , మే 10 : ఆన్లైన్ ద్వారా ఓ వ్యక్తి అకౌంట్ నుంచి రూ. 6లక్షల 77వేలు కాజేసిన ఘటన నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం… పీఎస్ పరిధి డిఫెన్స్కాలనీలో ఉంటున్న వి.జి. రఘునాథ అయ్యంగార్ (76) విశ్రాంత ఉద్యోగి. ఈ నెల 7న ఉదయం 10 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. బాధితుడిని మాటల్లో పెట్టి అకౌంట్ పాస్వర్డ్, యూజర్ ఐడీ మార్చుకున్నాడు. వెంటనే అతని ఎస్బీఐ ఖాతా నుంచి మొదటిసారి 4.99 లక్షలు, మళ్లీ 1.78లక్ష మొత్తం రూ.6.77లక్షలు ఖాళీ అయ్యాయి. వెంటనే మోసం జరిగిందని గమనించి బాధితుడు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.