సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆస్తి పన్ను బకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 30 సర్కిళ్లలో బకాయిదారుల చిట్టాను సిద్ధం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. రోజురోజుకు సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుండటం, ఈ ఆర్థిక సంవత్సరం రూ.2100 కోట్ల నిర్దేశిత లక్ష్యానికిగాను.. ఇప్పటి వరకు కేవలం రూ.1200 కోట్ల మేర పన్నులు రావడంతో బకాయిదారులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. మొదటి విడతలో ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయడం, పెద్ద మొత్తంలో బకాయి పడిన ఆస్తుల యాజమానుల జాబితాలను సిద్ధం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 డాకెట్లలో 13 లక్షల మంది పన్ను చెల్లింపుదారులలో బడా బకాయిదారుడికి రెడ్ నోటీసులు అందజేసి, 15 రోజుల్లోగా స్పందించని యాజమాని ఆస్తులను స్వాధీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాబోయే మూడు నెలల్లో రూ.900 కోట్ల లక్ష్యం
నిర్దేశిత లక్ష్యాల అమలులో నిర్లక్ష్యం తగదని, వీక్లీ టార్గెట్స్ కాకుండా డైలీ టార్గెట్గా పెట్టుకొని ఆస్తిపన్నును వసూలు చేయాలని అధికారులకు కమిషనర్ రొనాల్డ్రాస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాబోయే మూడు నెలల పాటు రూ.900 కోట్ల మేర లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో ఆస్తిపన్ను వసూళ్ల స్పెషల్ డ్రైవ్పై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే బకాయిదారులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులకు స్పందించకుంటే సంబంధిత షాపులను సీజ్ చేయడం లాంటి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.