మేడ్చల్, డిసెంబర్21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించేలా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మండలానికి ఓ ప్రత్యేక జిల్లా స్థాయి అధికారిని నియమించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగంగా చేయించేలా వీరు చర్యలు తీసుకుంటారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిధులకు సంబంధించి పరిశీలిస్తారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు.
జిల్లా వ్యాప్తంగా 2190 అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సీడీపీ, డీఎంఎఫ్టీ, ఎస్డీఎఫ్, పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 197.83 కోట్ల నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో కొన్ని అభివృద్ధి పనులు పూర్తికాగా మరికొన్ని చివరి దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న పనులను ప్రత్యేక అధికారులు పూర్తి చేయించేలా పర్యవేక్షించనున్నారు.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నెలకోసారి ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. జరుగుతున్న పనులు, పూర్తయిన వాటి వివరాలను సమీక్షా సమావేశంలో తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకుంటాం. ఐదు నియోజకవర్గాల్లోని 15 మండలాలకు సంబంధించి పనులు, ఖర్చుల వివరాలను తెలుసుకుంటూ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించేలా చూస్తాం. ప్రత్యేక అధికారులు మండలస్థాయి అధికారుల సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చూస్తాం.
-కలెక్టర్ హరీశ్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా.