హైదరాబాద్ : ప్రజావాణి ఆర్జీల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ప్రజావాణి(Prajavani) కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, కమిషనర్కు విన్నవించారు. వచ్చిన విన్నపాలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో వ్యక్తిగత సమస్యలపై ఎక్కువ విన్నపాలు వస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన 70 విన్నపాలు రాగా వాటిని సంబంధిత అధికారులకు పంపించారు.
ప్రజావాణికి ముందుగా కమిషనర్ రోనాల్డ్ రోజ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను సంబంధిత అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంత రెడ్డి, యాదగిరి రావు, జయరాజ్ కెన్నెడీ, గీతా రాధిక, తదితరులు పాల్గొన్నారు.