సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సీజనల్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా డెంగీ, మలేరియా, ఫ్లూ కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రధానంగా నగరంలోని 161 బస్తీ దవాఖానలు, 91 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలను అందుబాటులో ఉంచినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. బస్తీ దవాఖానల్లో కూడా 134రకాల టెస్టులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే డెంగీకి సంబంధించి ఎలిసా, ఎన్ఎస్1 పరీక్షలను సైతం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఒక్కరోజులోనే పరీక్ష నివేదికలు
నగరంలోని అన్ని బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలిసా, ఎస్ఎన్1 పరీక్షలకు సంబంధించిన కిట్లను అందుబాటులో ఉంచామని డాక్టర్ తెలిపారు. గతం కంటే ఈ సారి డెంగీ కేసులు పెద్దగా లేవని, అయినప్పటికీ అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వైద్య పరీక్షలకు సంబంధించిన నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిటిక్ సెంటర్కు పంపిస్తామని, అందులో భాగంగానే డెంగీ నమూనాలు కూడా సేకరించి పంపుతున్నట్లు తెలిపారు. టెస్ట్ రిపోర్టులు మరుసటి రోజే వస్తాయని, వాటి ఆధారంగా వెంటనే అవసరమైన చికిత్సను ప్రారంభిస్తారన్నారు. డెంగీపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అనుమానిత లక్షణాలుంటే దగ్గరలో ఉన్న బస్తీ దవాఖాన లేదా ఇతర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స పొందాలని సూచించారు.
కఠిన చర్యలు తప్పవు
డెంగీ అనుమానితులకు రాపిడ్ యాంటిజన్ పరీక్షలు నిర్వహిస్తే కచ్చితమైన ఫలితాలు రావని డాక్టర్ వెంకటి స్పష్టం చేశారు. గతంలో కొన్ని ప్రైవేటు దవాఖానల నిర్వాహకులు యాంటిజన్ చేసి డెంగీ అంటూ రోగులను తప్పుదారి పట్టించేవారని దీనిపై తీవ్రంగా స్పందించి, కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రైవేటులో నమోదయ్యే ప్రతి డెంగీ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు తెలియజేయడం తప్పనిసరిగా చేశామన్నారు. వివరాలు పంపని దవాఖాన నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.